రెండో ప్రధాన పంటగా తెల్లబంగారం
మూడు జిల్లాల్లో 6,15,889 ఎకరాల్లో సాగు
సిద్దిపేటలో 1,55,889 ఎకరాలు.. మెదక్లో 70 వేలు.. సంగారెడ్డిలో 3.90లక్షల ఎకలు
పంటల సాగు వివరాలను సేకరిస్తున్న వ్యవసాయ అధికారులు
నిండుకుండలా చెరువులు, చెక్డ్యాంలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వ్యవసాయ పనులు
పత్తిలో కలుపుతీత, మందులు వేసే పనిలో అన్నదాతలు
సిద్దిపేట, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాలో పత్తి సాగు జోరందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రైతాంగం దూదిపూలపై దృష్టి పెట్టింది. రెండో ప్రధాన పంటగా మారింది. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి రికార్డు స్థాయిలో సాగైంది. ఉమ్మడి జిల్లాలో పత్తి పంట సాగు లక్ష్యం 6.98లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 6,15,889 ఎకరాల్లో సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో 1,55,889 ఎకరాలు, మెదక్లో 70 వేలు, సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 93 వేల ఎకరాలు సాగైనట్లు ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. మరో వారం రోజులైతే, ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఎంత మంది రైతులు సాగు చేశారు? అనే వివరాలు పూర్తిగా తెలియనున్నాయి.
ఈ సారి జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తున్నాయి.. చెరువులు, వాగులు, చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి.. రైతులకు అనుకూలంగా కాలం కావడంతో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరి నాట్లు, పత్తి చేనులో కలుపుతీత పనులు, మందులు వేసే పనులు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఉమ్మడి జిల్లాలో రైతులు పత్తి పంటను ఎక్కువగానే సాగు చేశారు. పత్తి పంట రైతుకు లాభం ఉంటుంది. దీంతో రైతులు ఎక్కువగా ఈ పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి రికార్డు స్థాయిలో సాగైంది. ఉమ్మడి జిల్లాలో పత్తి పంట సాగు లక్ష్యం 6.98లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 6,15,889 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. రైతులు వేసిన పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. గతంలో పడావు ఉన్న భూముల్లో సైతం ఈసారి సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
నిండుకుండలా జలవనరులు..
జిల్లాలో మంచి వర్షాలకు తోడుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు పూర్తి కావడం, గత వేసవిలో అన్ని చెరువులు నింపడంతో పాటుగా ప్రస్తుతం రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు, చెక్డ్యాంలు నిండుకుంటున్నాయి. దీంతో రైతులు సంతోషంగా వానకాలం సాగు పనిలో ఉన్నారు. వరి పంట తర్వాత ఉమ్మడి జిల్లాలో పత్తి పంటను సాగు చేస్తారు. పత్తి పంట సాగుతో రైతులకు మంచి లాభాలు ఉండడంతో రైతులు ఈ పంటపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పత్తి పంటలను ప్రోత్సహిస్తున్నది. రైతులకు సకాలంలో రైతుబంధు అందించడంతో పాటు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచి రైతుకు సాగులో తోడ్పాటును అందించింది. రైతుకు వెన్ను దన్నుగా ఈ ప్రభుత్వం నిలుస్తున్నది. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పంటను రైతులు రికార్డు స్థాయలో సాగు చేశారు. మంచి నేలలు ఉండడంతో పాటు ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రిత పద్ధతిలో రైతులు సాగు చేశారు.
సిద్దిపేట జిల్లాలో పత్తి పంట సాగు లక్ష్యం 2లక్షల 20వేలు కాగా, ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 1,55,889 ఎకరాలు సాగు చేశారు. మెదక్ జిల్లాలో సాగు లక్ష్యం 85 వేల ఎకరాలు కాగా, 70 వేల ఎకరాలు సాగు చేశారు. సంగారెడ్డి జిల్లా లో 3 లక్షల 93 వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 3 లక్షల 90 వేల ఎకరాలు సాగు చేసినట్లు ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం అన్ని జిల్లాలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. మరో వారం రోజులైతే, ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఎంత మంది రైతులు సాగు చేశారు? అనే వివరాలు పూర్తిగా తెలియనున్నాయి. వరి, పత్తి పంటల తర్వాత అత్యధికంగా కంది పంటను సాగు చేశారు. దీంతో కంది సాగు కూడా పెరిగింది. పప్పు ధాన్యాలకు మంచి డిమాండ్ ఉంటుంది. కాగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలు చర్యలను ప్రభుత్వం తీసుకున్నది. ముందస్తుగానే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు రైతులకు రైతుబంధు ఇచ్చింది. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల రైతులు మంచి లాభాలు పొందుతారు.
ముమ్మరంగా వ్యవసాయ పనులు
వానకాలం సాగు సంబురంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో రైతులు తమ పంటలను సాగు చేశారు. ప్రస్తుతం కలుపుతీత, మందులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుం టలు, చెక్డ్యాంలకు నీళ్లు వచ్చి చేరాయి. దీంతో వరి నాట్లు కుడా జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మంచి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించింది. ఆ మేరకు రైతులు ప్రభుత్వం చెప్పినట్లుగా తమతమ భూముల్లో పంటలను సాగు చేశారు. పంటల పెట్టుబడి సాయం అందుతుండడంతో రికార్డుస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారలు వేసిన అంచనాలకు మించి సాగు చేశారు. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి, ఏ రైతు ఏ పంట ఎంత సాగు చేశారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. నాట్లు కొనసాగుతుండంతో దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా రావాల్సి ఉంది. పట్టా భూమి ఉన్న ప్రతి రైతుకు గుంటకు సైతం లెక్క కట్టి రైతుబంధు డబ్బులను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసింది. రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క రైతు మిస్ కాకుండా అందరి రైతుబంధు ఇచ్చి వెన్నుదన్నుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మాణాలను చేపట్టింది. రైతులంతా సమావేశమై పంటల సాగు తదితర అంశాలపై చర్చించుకునేందుకు ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయి. గ్రామాల్లోనే ఎరువులు అందుబాటులో ఉంచింది. రైతుకు ఎక్కడ ఇబ్బంది కలుగకుండా అన్ని రకాలుగా ప్రత్యేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో రైతులు సంతోషంగా తమ సాగు పనిలో నిమగ్నమయ్యారు.