కాలనీ వాసులదే జిమ్మేదారు
చెత్తబండొస్తే సమయం తెలిసేలా పని చేయండి
తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరుగా ఇచ్చి సహకరించండి
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జూలై 29 : ఖాళీ ప్లాట్లలో చెత్త వేయొద్దని, వేస్తే కాలనీ వాసులదే జిమ్మేదారుగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. అందరి సహకారంతోనే స్వచ్ఛ సిద్దిపేటను తయారు చేసుకుందామన్నారు. తడి, పొడి, హానికర చెత్త వేర్వేరుగా ఇచ్చి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలోని 7వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్లకు, 9వ వార్డులో రూ. 20 లక్షలతో సీసీ రోడ్ల పునరుద్ధరణ – నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై మంత్రి హరీశ్రావు మాట్లాడారు. రోజు ఇంటికి చెత్త బండొస్తుందా? తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తున్నారా? అంటూ ప్రజలతో ఆరా తీశారు. 7వ వార్డులో ఓపెన్, ఖాళీ ప్లాట్లలో చెత్త తీయిస్తే మరోసారి వేయకుండా బాధ్యత వహిస్తామని మాట ఇవ్వాలని 7వ వార్డు కాలనీవాసుల నుంచి మాట తీసుకున్నారు. ఖాళీ ప్లాట్లలో చెత్తలేకుండా క్లీన్ చేయాలని మున్సిపల్ శానిటేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. నల్లా నీళ్లు వృథాగా పోతున్నట్లు పలువురు కాలనీ మహిళలు మంత్రి దృష్టికి తేగా, ఎంతో వ్యయంతో నీళ్లు తెస్తున్నామని ప్రజలకు అవగాహన కల్పించి నీరు వృథా చేయొద్దని, నల్లా బంద్ చేయాలని విన్నవించారు.
యూజీడీతో గల్లీల్లో గుంతలు ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రోడ్డు వేయించాలని అవ్వ భూలక్ష్మి మంత్రి దృష్టికి తేగా, 15 రోజుల్లో గల్లీలో సీసీ రోడ్లు వేసి గచ్చులా మారుస్తామని భరోసా ఇచ్చారు. 9వ వార్డు కాలనీలో ప్రధానంగా పెద్ద మోరీ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరగా, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారికి మంత్రి సూచించారు. కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద ఎక్కువ ఉందని మంత్రి దృష్టికి తేగా, కోతుల సమస్య పరిష్కారంతో పాటు, వీధి కుక్కల నియంత్రణ కోసం యనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ పెట్టినట్లు రెండు రోజుల్లో నివారించాలని మున్సిపల్ వర్గాలకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీదేవి బుచ్చిరెడ్డి, పసుపుల సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ఈఈ వీరప్రతాప్, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్థానిక జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలి
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులను వారి వారి జిల్లాలకు ఐచ్ఛికం ద్వారా పంపించి పదోన్నతులు, నియామాకాలు చేపట్టాలని ఆర్థిక మంత్రి హరీశ్రావుకు రాష్ట్ర పీఆర్టీయూ నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారం సిద్దిపేటలో మంత్రిని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యనారాయణ కలిసి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులలోని పేరా 3 ప్రకారం జనాభా ప్రాతిపదికన అన్ని క్యాడర్ల ఉపాధ్యాయ, ఉద్యోగుల పోస్టులను జిల్లాల వారీగా కేటాయించి, వారి స్థానికతను బట్టి ఆప్షన్లు ఇచ్చి, వారి జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలన్నారు. తమ విజ్ఞప్తి మేరకు మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించి ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని, సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉంచాలని చెప్పినట్లు వారు తెలిపారు.
అలాగే అన్ని సొసైటీల పరిధిలోని గురుకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల వేతన సవరణ 2020 ని వర్తింపజేయాలని కోరగా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. డీఎస్సీ 2003 ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరినట్లు తెలిపారు. సర్వశిక్షా అభియాన్లో పని చేస్తున్న సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఆధారంగా పని చేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్కు వేతనాలు పెంచాలని కోరగా, అది ఆర్థిక శాఖ సర్క్యూలేషన్లో ఉందని, రెండు మూడు రోజుల్లో ఉత్తర్వు లు జారీ చేసేందుకు హామీ ఇచ్చినట్లు పీఆర్టీయూ నేతలు తెలిపారు.