బైపీసీలో మొదటి ర్యాంకు సాధించిన సిద్దిపేట విద్యార్థిని రిషిక
అభినందించిన మంత్రి హరీశ్రావు, డీఈవో రవికాంతారావు
ఎంపీసీలో 77.85 శాతం, బైపీసీ విభాగంలో 74.16 శాతం ఉత్తీర్ణత
సిద్దిపేట జిల్లాలో పరీక్ష రాసిన 3,305 మంది,మెదక్ జిల్లాలో 1783 మంది విద్యార్థులు
సిద్దిపేట అర్బన్, జూలై 28 : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. సిద్దిపేట జిల్లాలో మొత్తం 3,305 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఎంపీసీ విభాగంలో 2,573 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు సాధించారు. బైపీసీ విభాగంలో 2,451 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ విభాగంలో 77.85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బైపీసీ విభాగంలో 74.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆగస్టు నెలలో కౌన్సెలింగ్ నిర్వహించి, సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
ప్రతిభ కనబరిచిన సిద్దిపేట విద్యార్థులు…
పాలిసెట్ 2021 ప్రవేశ పరీక్షా ఫలితాల్లో సిద్దిపేటకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. సిద్దిపేట పట్టణానికి చెందిన కలకుంట్ల రిషిక 120 మార్కులకు 117 మార్కులు సాధించి బైపీసీ విభాగంలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా, ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది. అలాగే సిద్దిపేట పట్టణానికి చెందిన రామిని మాధవ్ అనే విద్యార్థి 120 మార్కులకు 113 మార్కులు సాధించి బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించగా, ఎంపీసీ విభాగంలో 35వ ర్యాంకు సాధించాడు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన జిందం శ్రీనాథ్ బైపీసీ విభాగంలో 86వ ర్యాంకు సాధించాడు.
రెండు విడుతల్లో కౌన్సెలింగ్..
పాలిసెట్ 2021 ప్రవేశాలకు రెండు విడుతల్లో కౌన్సెలిం గ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి మొదటి విడుత కౌన్సెలింగ్ ప్రారం భం కానుండగా, 5 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకిం గ్, 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 6 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్, ఆగస్టు 14న మొదటి విడుత సీట్లు కేటాయించనున్నారు. అలాగే ఆగస్టు 23 నుంచి తుది కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. 23, 24న స్లాట్ బుకింగ్, సర్టిఫికేషన్, 24,25న వెబ్ ఆప్షన్లు, 27న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి.
అభినందించిన మంత్రి హరీశ్రావు..
పాలిసెట్ పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన విద్యార్థిని కె.రిషికకు బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, ఎంపీసీ విభాగంలో 6వ ర్యాంకు సాధించినందుకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మం త్రి హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాను రాష్ట్ర స్థాయి లో ప్రథమ స్థానంలో నిలిపినందుకు ప్రత్యేకంగా అభినందించారు. రిషిక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
సంగారెడ్డి జిల్లాలో 75.44 శాతం ఉత్తీర్ణత..
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 28 : జిల్లాలో మొత్తం 3530 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాశారు. ఇందులో 2192 మంది బాలురు, 1338 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలో మొత్తం 75.44 ఉత్తీర్ణత శాతం నమోదైంది. అయితే కోర్సుల వారీగా చూస్తే బైపీసీ కోర్సులో మొత్తం 2775 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 78.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా ఎంపీసీ కోర్సుకు సంబంధించి 1492 మంది బాలురు, 1059 మంది బాలికలు, మొత్తం 2551 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 72.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో మొత్తం ముగ్గురు విద్యార్థులు టాప్ ర్యాంకులో నిలవగా, సంగారెడ్డి సిద్ధార్థనగర్కు చెందిన పూల పవన్కుమార్ 51వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. శాంతినగర్కు చెందిన కోమటి సుదీశ్న 57వ ర్యాంకు, నారాయణఖేడ్ శాస్త్రీనగర్కు చెందిన వెంకటసాయి చరణ్ 70వ ర్యాంకు సాధించారు.
రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన విద్యార్థులు
మెదక్ మున్సిపాలిటీ, జూలై 28 : ఈనెల 17న జరిగిన పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1783 విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. మెదక్ పట్టణానికి చెందిన రామరాజు స్నిగ్ద రాష్ట్ర స్థాయిలో 171వ ర్యాంకు, రత్నసాయి కిరిటి 477వ ర్యాంకు సాధించారు. చిన్నశంకరంపేట మండలం చందపూర్కు చెందిన అంజని 112వ ర్యాంకు, నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన వినీత్గౌడ్ 184వ ర్యాంకు సాధించారు.
చాలా ఆనందంగా ఉంది..
పాలిసెట్ ప్రవేశ పరీక్షలో బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు 120 మార్కులకు 117 మార్కులు వచ్చా యి. నేను సిద్దిపేట పట్టణంలోని ఎస్ఆర్ డీజీ స్కూల్లో పదో తరగతి చదివాను. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం చదివిన తక్కువ సమయంలోనే ఏకాగ్రతతో చదివాను. నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్లో సివిల్స్ సాధించాలన్నదే నా లక్ష్యం.
113 మార్కులు వచ్చాయి..
పాలిసెట్ ప్రవేశ పరీక్షలో నాకు 120 మార్కులకు 113 మార్కులు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో బైపీసీ విభాగంలో 3వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నేను సిద్దిపేట పట్టణంలోని వికాస్ హైస్కూల్లో 10వ తరగతి చదివాను. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకు రావడానికి కారణమైన నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు.