వరంగల్ : గత 16 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న రూ.2కోట్ల విలువైన భూమి వివాదం కేసు.. న్యాయమూర్తి చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది. 2006 నుంచి కొనసాగుతున్న న్యాయ పోరాటానికి శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో పరిష్కారానికి నోచుకుంది. ఏడో అదనపు జిల్లా జడ్జి ప్రభాకర్రావు చొరవతో భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న కక్షిదారులు అందరూ రాజమార్గం ద్వారా కేసును పరిష్కరించుకున్నారు. వరంగల్ నగరంలోని 324 గజాల స్థలం విషయమై స్థానిక కోర్టు నుంచి మొదలైన వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లడమే కాకుండా.. అనేక సివిల్, క్రిమినల్ కేసుల నమోదుకు దారి తీసింది. రాజమార్గం ద్వారా కేసును పరిష్కరించాలని న్యాయమూర్తి ప్రభాకర్రావు చొరవ చూపి.. అందరినీ మెప్పించి, ఒప్పించి కేసును పరిష్కరించడంతో కక్షిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసును ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా పెండింగ్ కేసులతో సతమతమవుతున్న కక్షిదారులు తమ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి పిలుపునిచ్చారు.