బషీరాబాద్, జూలై 8 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం తగదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. గురువారం మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో పర్యటించి ప్రకృతి వనం, వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ పలు చోట్ల చెత్త, కంప చెట్లు పెరిగి ఉండడాన్ని గమనించి వెంటనే తొలగించాలని కార్యదర్శిని ఆదేశించారు. మరుగుదొడ్డ నిర్మాణం, మురుగు నీటిపై ఆరాతీశారు. ఎస్సీ కాలనీలో ఒక ఇంటి వద్ద మురుగు నీరు ఆగి ఉండటాన్ని గమనించి అపరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు సోకుతాయని ఆ కుటుంబ సభ్యులకు వివరించారు. మురుగు నీటిని వెంటనే తొలగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చివేయాలని, పాడుబడ్డ బావిపై కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్లపై వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేయాలని, వంగిన, తుప్పు పట్టిన కరెంట్ స్తంభాలను తొలగించాలన్నారు. అవసరమైన చోట మురికి కాలువలకు కొత్త డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలన్నారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మొక్కను నాటి, ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటేలా సర్పంచ్, కార్యదర్శి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీవో రిజ్వానా, ఎంపీపీ కరుణ, సర్పంచ్ నవనీత, ఎంపీటీసీ సుజాత, ఎంపీడీవో రమేశ్, ఉప సర్పంచ్ జగదీశ్ పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
పరిసరాల శుభ్రత అందరి బాధ్యతని కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా కలెక్టర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, కౌన్సిలర్ శోభారాణితో కలిసి 1, 15 వార్డుల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక సమస్యలను నేరుగా ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బంది, అధికారులకు సూచించారు. అనంతరం ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.