ఖమ్మం జిల్లాలో 54 నిర్మాణాలు
24 నిర్మాణాలకు నిధులు మంజూరు
త్వరలో 30 నిర్మాణాలకు అనుమతులు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఖమ్మం, జూలై 4 : తెలంగాణ సర్కార్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి పంటలకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే ‘మిషన్ కాకతీయ’ పథకంలో భాగంగా రాష్ట్రంలోని చెరువులన్నింటినీ పటిష్టం చేసింది. మరోవైపు భాగంగా చిన్ననీటి పారుదలకూ ప్రాధాన్యతనిస్తున్నది. ఉమ్మడి జిల్లా రైతుల ప్రయోజనాల కోసం ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూనే మరోవైపు చిన్న నీటి వనరులపైనా దృష్టి సారించింది. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రైతులకు మేలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నది. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు 54 చెక్డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో రూ.176.59 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది. వీటిలో 24 చెక్డ్యాంలకు మొదటి విడత నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే 18 చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఆరు చెక్డ్యాంలు ఈ నెలాఖరులోపు పూర్తవుతాయి. నీటి పారుదలశాఖ అధికారులు శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నారు. రెండవ విడతలో మరో 30 చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉన్నది.
యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు..
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో జిల్లాకు 54 చెక్ డ్యాంలు మంజూరయ్యాయి. వీటిలో 24 నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఈ నిర్మాణాలు తుదిదశకు చేరాయి. వీటిలో ఖమ్మం నియోజకవర్గంలో 2, పాలేరు ఐదు, వైరా తొమ్మిది, సత్తుపల్లి నాలుగు, మధిర నియోజకవర్గంలో నాలుగు చెక్డ్యాంలు చివరి దశలో ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల పరిధిలోని కేవీ బంజర వద్ద 40 మీటర్ల పొడవునా నిర్మించిన చెక్డ్యాం పనులు పూర్తయ్యాయి. ఖమ్మం నగర పరిధిలోని మున్నేరుపై ప్రకాశ్నగర్ వద్ద నిర్మాణం పూర్తయింది. ఇటీవల ఈ చెక్డ్యాంను మంత్రి అజయ్ ప్రారంభించారు. వైరా నియోజకవర్గంలోని గరికపాడు వద్ద 100 మీటర్లు, జూలూరుపాడు మండలంలోని కరివారిగూడెం వద్ద 40 మీటర్లు, బేతాలఅపాడు వద్ద 40 మీటర్లు, ఏన్కూరు మండలంలోని నాచారం వద్ద 50 మీటర్లు, రంగాపురం వద్ద 50 మీటర్లు, వైరా మండలంలోని పుణ్యపురం వద్ద 100 మీటర్లు, సింగరేణి మండలంలోని రొట్టమాకురేవు వద్ద 50 మీటర్లు , గేట్ కారేపల్లి వద్ద 35 మీటర్లు, కమలాపురం వద్ద 35 మీటర్ల పొడవునా నిర్మాణాలు పూర్తయ్యాయి.
పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం, రామచంద్రాపురం వద్ద 125 మీటర్లు పొడవునా నిర్మించే చెక్డ్యాం, బుద్దారం వద్ద 100 మీటర్లు పొడవునా నిర్మిస్తున్న చెక్డ్యాం, ఖమ్మం రూరల్ మండలంలోని తనగంపాడు వద్ద 120 మీటర్లు పొడవునా నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయి. కూసుమంచి మండలం రాజుపేట వద్ద 114 మీటర్లు, తిరుమలాయపాలెం మండలం ముజాహిదీపురం వద్ద చెక్డ్యామ్ం నిర్మాణాలు పూర్తయ్యాయి. తల్లాడ మండలంలోని కిష్టాపురం వద్ద 160 మీటర్ల పొడవునా నిర్మించిన చెక్డ్యాం పనులు పూర్తయ్యాయి. కల్లూరు మండలంలోని పుల్లయ్యబంజర వద్ద 40 మీటర్లు, వేంసూరు మండలంలోని రామన్నపాలెం వద్ద 35 మీటర్ల పొడవునా నిర్మిస్తున్న చెక్డ్యాంలు ఈ నెలలో పూర్తికానున్నాయి. పెనుబల్లి మండలం మండలపాడు వద్ద నిర్మించిన చెక్డ్యాం పూర్తయింది. మధిర నియోజవర్గం ఎర్రుపాలెం మండలంలోని శకినవీడు, మధిర మండలంలోని తొర్లపాడు వద్ద నిర్మాణాలు పూర్తయ్యాయి. చిలుకూరు, మధిరలో చేపట్టిన చెక్డ్యాంల పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయి. చెక్డ్యాంల నిర్మాణంపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్మాణంతో భూగర్భజలాలు పెరుగుతాయని, సాగునీటి సమస్యలు ఉండవంటున్నారు.
మున్నేరుపై మరో మూడు చెక్డ్యాంలు
ఖమ్మం నగరం నుంచే ప్రవహించే మున్నేరుపై ప్రకాశ్నగర్ వద్ద ఇప్పటికే చెక్డ్యాం నిర్మాణం పూర్తయింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో మరో మూడు చోట్ల చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కరుణగిరి బైపాస్, కాల్వొడ్డు వైకుంఠధామం, ధంసలాపురం వద్ద ఈ మూడు చోట్ల త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మూడింటిలో ధంసలాపురం వద్ద నిర్మించే చెక్డ్యాంకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. త్వరలో మిగిలిన రెండు నిర్మాణాలకు నిధులు మంజూరు కానున్నాయి.
ప్రతి నీటి వనరునూ కాపాడతాం..
ఉమ్మడి జిల్లాలో ప్రతి నీటి వనరునూ కాపాడుతాం. సీతారామ ఎత్తిపోతల పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. గోదావరి జలాలను పాలేరుకు తీసుకువచ్చే పనులూ నెల రోజుల్లో ప్రారంభమవుతాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. పెద్ద ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరులనూ సాగుకు అనుకూలంగా మారుస్తాం. చిన్న నదులు, వాగులపై చెక్డ్యాంల నిర్మాణం చేపడతాం. అనుమతులు వచ్చిన 30 చెక్డ్యాంలను పూర్తి చేసి మరో వంద నిర్మాణాలకు శ్రీకారం చుడతాం. రైతుల ప్రయోజనాలు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం.
శరవేగంగా నిర్మాణాలు..
జిల్లాలో చేపట్టిన చెక్ డ్యాంల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటివరకు 18 పూర్తయ్యాయి. మిగిలిన ఆరింటినీ ఈనెలలో పూర్తి చేస్తాం. నిధుల కొరత లేదు. గతంలో మంజూరైన వాటినీ రెండు నెలల్లో ప్రారంభిస్తాం. కొత్త నిర్మాణాలకు ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు ఇచ్చారు. వాటి అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించాం. వాటికి త్వరలోనే అనుమతులు వస్తాయి.