రూ.1.50కోట్లతో ‘గిరి వికాసం’ పథకం
జిల్లాలో 40 నుంచి 50 మందికి లబ్ధి
విద్యుత్తో పాటు సాగునీటి వసతి కల్పన
ఒక్కో యూనిట్కు రూ. 3లక్షల నుంచి రూ. 4.5 లక్షల ఖర్చు
ఈ నెల 30 లోగా లబ్ధిదారుల ఎంపిక
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ):వ్యవసాయమే ఆధారంగా జీవించే ఆదిమ గిరిజనులకు సాగులో అండగా నిలిచేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ‘గిరి వికాసం’ పథకాన్ని అమలు చేస్తున్నది. దీని ద్వారా గిరిజనులు సాగు చేసుకునే భూములకు సాగునీరు, విద్యుత్, తదితర వసతులను వంద శాతం రాయితీపై ప్రభుత్వం అందించనున్నది. జిల్లాలో ఈ పథకానికి 40 నుంచి 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా, రూ. 1 కోటీ 50 లక్షలను కేటాయించింది. ఈనెలాఖరుకల్లా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనుండగా, ఇందుకోసం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఆదిమ గిరిజనులకు ప్రభుత్వం ‘గిరి వికాసం’ పథకం ద్వారా అండగా నిలుస్తున్నది. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు వంద శాతం రాయితీతో సౌకర్యాలు కల్పించనున్నారు. జిల్లాలో 40 నుంచి 50 మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కో యూనిట్కు రూ. 3 లక్షల నుంచి రూ. 4.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. రైతులకు చేళ్లలో కావాల్సిన వ్యవసాయ కనెక్షన్ ఏర్పాటు చేయటంతోపాటు, బోర్లు వేయడం, మోటర్లు ఇవ్వడం, సాగునీటికి అవసరమైన అన్ని వసతులను ఉచితంగా కల్పిస్తారు. ఆదిమ గిరిజనులను వ్యవసాయంలో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తోంది.
ఈ నెలాఖరుకల్లా లబ్ధిదారుల ఎంపిక
ఈ నెల 30వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదిమ గిరిజనులకు వంద శాతం రాయితీపై అందించే ఈ పథకాన్ని పూర్తి పాదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ లైన్లు వేసి సౌకర్యం కల్పించడంలో అటవీ శాఖ నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని అధికారులే పరిష్కరించనున్నారు. అదే విధంగా ఉమ్మడి వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. పక్కపక్కనే భూములు ఉన్న వారు ఒకే బోరు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. పదెకరాల భూమికి ఒక యూనిట్ చొప్పున అమలు చేయనున్నారు. సమన్వయంతో పనిచేసుకునే రైతులను గుర్తించి, వారికి ప్రయోజనం చేకూర్చేలా పథకాన్ని వర్తింపజేయనున్నారు.
ఆదివాసీ రైతులకు ప్రయోజనం
గిరి వికాస పథకం ద్వారా జిల్లాలోని ఆదిమ తెగలకు చెందిన గిరిజనులకు ప్రయోజనం కల్పించేలా చూస్తారు. జిల్లాలో కొలాం, తోటి, మన్నెవార్ తెగలకు చెందిన గిరిజనులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. వీరందరినీ గుర్తించి, వారి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు.