లండన్, జూన్ 17: ఇంగ్లండ్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ప్రతి 11 రోజులకు కేసులు రెట్టింపవుతున్నాయి. కరోనా ఉద్ధృతికి కారణం డెల్టా వేరియంటేనని ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. డెల్టా వేరియంట్ను తొలిసారిగా భారత్లో కనుగొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రకం బ్రిటన్లో అలజడి సృష్టిస్తున్నది. ఇంపీరియల్ కాలేజ్ అధ్యయనంలో భాగంగా.. మే 20 నుంచి జూన్ 7 మధ్య ఇంటింటికి వెళ్లి లక్ష మంది నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షించారు. ప్రతి 670 మందిలో ఒకరికి (0.15 శాతం) కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు, రోగులను దవాఖానాల్లో ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం, మరణాలు తగ్గుతూ రాగా ఏప్రిల్ నుంచి పరిస్థితి మారింది. దవాఖానల పాలవుతున్న కరోనా రోగుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నదని గుర్తించారు. మే చివరి నుంచి జూన్ మొదటి వారంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇది డెల్టా వేరియంట్ ప్రభావాన్ని సూచిస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.
అమెరికాలో 9.9 శాతం కేసులకు డెల్టానే కారణం
తొలిసారిగా భారత్లో కనుగొన్న కరోనా వైరస్ డెల్టా రకాన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా (ఆందోళన కలిగించే స్థాయి ఉన్న వైరస్గా) అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) గుర్తించింది. విస్తృతంగా వ్యాపించడం, వ్యాధి తీవ్రతను పెంచే రకాలను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. డెల్టాకు వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు కొన్ని ఔషధాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని సీడీసీ పేర్కొంది. ఇంతకుముందు డెల్టాను ‘కన్సర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా పరిగణించింది. ఈ నెల 13 వరకు అమెరికాలో 9.9 శాతం కరోనా కేసులకు డెల్టా రకమే కారణమని గుర్తించారు.