జగిత్యాల : విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమాజంలోని అన్యాయంపై పోరాడేందుకు మహాత్మాగాంధీ, అంబేద్కర్, జ్యోతిరావుపూలే వంటి వారికి విద్య సహాయ పడిందన్నారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్గా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుస్తకాల అధ్యయనం ద్వారానే సీఎం కేసీఆర్ అపారమైన జ్ఞానాన్ని సంపాదించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఈ జ్ఞానం ముఖ్యభూమిక పోషిందన్నారు.
జిల్లాలోని గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు తన వంతు సహాయం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు గ్రంథాలయాలను అందుబాటులోకి తెస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 15 మండలాల్లో గ్రంథాలయాలు ఉన్నట్లు తెలిపిన ఆమె తర్వలోనే మరో మూడు మండలాల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇ-లైబ్రరీని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన కవిత జగిత్యాల లైబ్రరీని రాష్ట్రంలో రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తామన్నారు. నూతనంగా నియమితులైన ఛైర్మన్ నాయకత్వంలో త్వరలోనే కొత్త లైబ్రరీ భవనం నిర్మాణానికి పునాది రాయి వేసుకుందామన్నారు. జిల్లాల్లో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తాయని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.