హుజూరాబాద్ను అగ్రభాగాన నిలుపుతాం
జమ్మికుంట మండల అభివృద్ధికి పెద్దపీట
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
జమ్మికుంట, జూన్ 13: రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది.., చేసేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేట, నాగంపేట, బిజిగిరిషరీఫ్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలంతా చైతన్యానికి మారుపేరని, ఉద్యమ స్ఫూర్తిని చాటాలన్నారు.
నియోజకర్గంలో జరిగిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందు ఉందన్నారు. రానున్న రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని హామీ ఇచ్చారు. ఇక అందులో జమ్మికుంట మండలానికి పెద్దపీట వేస్తామని ప్రకటించారు. పెండింగ్ పనులన్నీ త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. పార్టీలోకి వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏం చేయలేరని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో అన్ని వర్గాల నాయకులు కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి పనిచేశారని, పార్టీని బద్నాం చేసిన ‘ఈటల’ వ్యక్తిత్వం ఏంటో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని, ప్రత్యర్థులకు దిమ్మదిరిగే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.