న్యూఢిల్లీ: వచ్చే డిసెంబర్ నాటికి 70 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కావొచ్చునని ఫోర్టిస్ హెల్త్కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కం మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ రఘువంశీ చెప్పారు. కరోనా రెండో వేవ్ దేశంలో ఆరోగ్య రంగంలో పెట్టుబడుల కొరతను బయటపెట్టిందన్నారు. మున్ముందు ఆరోగ్య పరిరక్షణ రంగంలో మౌలిక వసతుల కల్పనపై అంతా ద్రుష్టి సారిస్తారని అన్నారు.
భారీ జనాభా గల భారత్లో ఏ క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను నియంత్రించడానికి సరైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే 3-5 ఏండ్లలో 1300 బెడ్లను అదనంగా తమ దవాఖానల్లో చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రఘువంశీ చెప్పారు.
త్వరలో భారీ విస్తరణ, టేకోవర్ల కోసం ద్రుష్టి పెట్టామని ఫోర్టిస్ సీఈవో రఘువంశీ చెప్పారు. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కేసులు శరవేగంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
కరోనా రెండోవేవ్ ప్రభావం నాన్-కోవిడ్ చికిత్సపై ప్రభావం చూపిందన్నారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
తొలి దశలో కరోనా కేసుల ఆక్యుపెన్సీ రేటు 25-29 శాతం ఉంటే, రెండో దశలో 69-70 శాతానికి పెరిగిందని చెప్పారు. త్వరలోనే నాన్-కోవిడ్ చికిత్సలు శరవేగంగా పుంజుకుంటాయన్నారు. వచ్చే నెలలో కోవిడ్ సంబంధ చికిత్సతో ఆదాయం 10-15 శాతం తగ్గుతుందని, ఇతర చికిత్సలతో 45 % పెరుగుతుందన్నారు.
ప్రస్తుతం భారత్లో హెల్త్కేర్ శక్తి సామర్థ్యాలు మెరుగయ్యాయని రఘువంశీ పేర్కొన్నారు. మున్ముందు విస్తరణతోపాటు ఖర్చుల తగ్గింపుపై ద్రుష్టి సారిస్తామన్నారు. ఫొర్టిస్కు సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలు కరోనా వ్యాక్సినేషన్ను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. సాధ్యమైనంత త్వరలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటుందని తెలిపారు.