హైదరాబాద్, ఆట ప్రతినిధి: టోక్యో ఒలింపిక్స్ అర్హత విషయంలో తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, సిక్కిరెడ్డి, శ్రీకాంత్కు అన్యాయం జరిగిందని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కరోనా ప్రభావంతో అర్హత టోర్నీలు రద్దయిన కారణంగా వారు ఒలింపిక్స్కు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని, అందువల్ల వారికి మరో అవకాశం కల్పించేలా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ, భారత ఒలింపిక్ సంఘం, భారత బ్యాడ్మింటన్ సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. కాగా విశ్వక్రీడల అర్హత టోర్నీలైన ఇండియన్, సింగపూర్ , ఇండోనేషియన్ ఓపెన్ రద్దు కావడంతో శ్రీకాంత్, సైనా,సిక్కిరెడ్డి, పొన్నప్పకు ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకునే అవకాశం రాలేదు. దీంతో టోక్యోలో పాల్గొనే చాన్స్ కోల్పోయారు. యూరోపియన్ సర్క్యూట్లో టోర్నీలు జరుగగా.. ఆసియా పరిధిలో టోర్నీలు రద్దవడంతో మన షట్లర్లకు చుక్కెదురైంది.