సామవేద సంబంధమైన ‘కేనోపనిషత్తు’ ప్రథమఖండం ‘బ్రహ్మాన్ని (పరమాత్మ) నిర్వచించిన తీరు’ అద్భుతం.
కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః
కేనేషితం వాచమిమాం వదంతి చక్షుః
శ్రోతం క ఉ దేవో యునక్తి ॥
ఎవరిద్వారా ప్రేరేపితమై మన మనసు పరిపరి విధాల పరుగులెత్తుతూ ఉంటుంది? ఈ శ్రేష్ఠమైన ప్రాణం ఎవరిద్వారా నియంత్రితమై నిలుస్తున్నది? మనిషి ఎవరిద్వారా ప్రేరేపితుడై మాట్లాడగలుగుతున్నాడు? ఏ అతీతమైన, అవ్యక్తమైన శక్తి మన నేత్రాలను, చెవులను నియంత్రిస్తున్నది?- ఈ ప్రశ్నలకు సమాధానమే ‘బ్రహ్మవిద్య’. పరమాత్మ తత్వం వల్లే మన కర్ణేంద్రియాలకు శ్రవణశక్తి వచ్చింది. మనసుతో ఆలోచించే శక్తి సమకూరింది. వాగేంద్రియంతో వాక్శక్తి, ప్రాణం సంచరించేదిగా, జీవంతమై, కండ్లు దర్శించేవై వున్నాయి. వీటన్నిటికీ కారణభూతమైన పరమాత్మను తెలుసుకున్న ధీర పురుషుడు ఈ నేత్రాలతో, కర్ణేంద్రియాలతో, మనసు తదితర ఇంద్రియాలతో ఉద్వేగ పడకుండా ఉన్నపుడే ‘జీవన్ముక్తుడు’ (అమరుడు) కాగలడు.
పరబ్రహ్మయైన పరమాత్మ వరకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఏవీ చేరుకోలేవు. పరబ్రహ్మను తెలుసుకునేంతటి బుద్ధి-జ్ఞానం మనకు లేవు. అలాగే, ఎవరి వ్యాఖ్యానం ద్వారాకూడా అది సంభవమయ్యేది కాదు. అన్నిటికీ అతీతుడైన పరబ్రహ్మ గురించి తెలుసుకోవడం సామాన్యులకు అసాధ్యం. వాణిచేత వర్ణింపనలవి కానిది, దేని మహిమచేత వాణి ప్రకటితమవుతున్నదో అదే ‘బ్రహ్మం’. మనసుచేత మననం చేయరానిది కానీ, ఏ మహత్తత్వం చేత ‘మననం’ జరుగుతున్నదో అదే ‘బ్రహ్మం’. అలాగని, మనసు ద్వారా ‘మననం’ చేస్తూ, దేనినైతే ఉపాసిస్తామో అది బ్రహ్మం కాదు. దేనినైతే కండ్లద్వారా చూడలేమో, కానీ కండ్లు ఏ మహిమచేత చూపుకు నోచుకున్నవో అదే బ్రహ్మం. కండ్లతో చూడతగిన రూపాన్ని ఉపాసిస్తే అదీ బ్రహ్మం కాదు. కర్ణేంద్రియాలద్వారా దేనినైతే వినలేమో, కానీ ఏ మహత్తత్వం చేత వినడానికి యోగ్యులమవుతున్నామో అదే బ్రహ్మం. వినడం ద్వారా ఏ తత్వాన్నయితే ఉపాసిస్తామో అదికూడా బ్రహ్మం కాదు. ప్రాణం ద్వారా ప్రేరేపితం కానిది కానీ, ప్రాణం దేనిచేత ప్రేరేపితమవుతున్నదో దానిని బ్రహ్మంగా గుర్తించాలి. అలాగని, ప్రాణశక్తిద్వారా క్రియాశీలమై ఏ తత్వాన్ని ఉపాసిస్తామో అదిసైతం బ్రహ్మం కాదు. మొత్తం మీద వాక్కు, మనసు, నేత్రాలు, చెవులు, ప్రాణం వంటివన్నీ కేవలం పరబ్రహ్మ శక్తిచేతనే పనిచేస్తున్నాయని దీనినిబట్టి మనం అర్థం చేసుకోవాలి.
యం.వి.
నరసింహారెడ్డి
98491 10922