‘ధరణి’ పెండింగ్ దరఖాస్తులపైదృష్టి సారించాలి
కలెక్టర్ వెంకట్రావు
తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్
మహబూబ్నగర్, జూన్ 3 : ధరణి పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు తాసిల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్లో సమర్పించిన దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. 7వ తేదీలోగా ధరణి కింద ఉన్న ప్రతి క్లెయిమ్నూ పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారని, వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అలాగే ప్రతిరోజూ 9గంటలకు భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సూచించారు. ప్రతి సక్సేషన్ను పంచనామా నిర్వహించి పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో ధరణి కింద 2527 కేసులు ఉండగా, వాటన్నింటినీ క్లియర్ చేయాలన్నారు. అలాగే 49 సక్సేషన్ కేసులు ఉన్నాయని, వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రొహిబీటెడ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి అప్డేట్ చేయాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, డీఆర్వో స్వర్ణలత తదితరులు ఉన్నారు.
ప్రతి గ్రామంలో 100మందికి పని కల్పించాలి
ప్రతి గ్రామంలో కనీసం 100మందికి ఉపాధి హామీ పనులు కల్పించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలన్నారు. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద సెల్ప్ ఆఫ్ వర్క్తోపాటు జాబ్కార్డులు సిద్ధంగా ఉన్నాయని, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. కాగా, ఆయా మండలాల ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ల వారీగా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ బాలానగర్, రాజాపూర్ ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వచ్చే బుధవారం నాటికి పనుల్లో పురోగతి కనిపించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నచింతకుంట, హన్వాడ మండలాల్లో కూలీల సంఖ్య ఎక్కువగా ఉండడంపై ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వీసీలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఆర్డీవో యాదయ్య, ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు.