ఇందూరు/ కామారెడ్డి టౌన్, జూన్ 3 : శానిటేషన్ డ్రైవ్ను పకడ్బందీగా చేపట్టాలని నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ల నుంచి వేర్వేరుగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9వ తేదీలోపు కరోనా కట్టడికి మూడో విడుత సర్వే చేపట్టాలని ఆదేశించారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహించి వారికి కావాల్సిన మెడికల్ కిట్లను ఇచ్చి మందులు వాడే విధంగా చూడాలన్నారు. ఒక టీం 50 ఇండ్లను సర్వే చేయాలన్నారు. మెడికల్ కిట్లు గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.
నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్నందున శానిటేషన్ డ్రైవ్ను పకడ్బందీగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీల్లో మట్టిని, పిచ్చిమొక్కలను తొలగించాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కాలువల మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ చైర్మన్లతో సమావేశం నిర్వహించుకుని వార్డుల వారీగా ఎక్కడా వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ అర్బన్ లాక్డౌన్ పకడ్బందీగా జరుగుతున్నదని, మోర్తాడ్, భీమ్గల్, రాకాసీపేట్, ఎడపల్లి, కమ్మర్పల్లి, సిరికొండ మండలాల్లో పాజిటివిటీ ఎక్కువగా ఉందన్నారు. పెండ్లిళ్లు, విలేజ్ మార్కెట్లు, సంతలు, బార్డర్ చెక్పోస్ట్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కామారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో మూడో విడుత ఆరోగ్య సర్వే చేపట్టాలన్నారు. బీబీపేట, ఎల్లారెడ్డి, దోమకొండ, తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్, కామారెడ్డికి సంబంధించి దేవునిపల్లి, రాజీవ్నగర్, గాంధారి మండలాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున ప్రతి ఇంటినీ తప్పకుండా పరిశీలించాలన్నారు. ప్రతి పాజిటివ్ కేసును ట్రాకింగ్ చేయాలని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను కూడా హోం ఐసోలేషన్ చేయాలని, వసతి లేని వారికి ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో, తండాల్లో బయటి నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకొని పరిశీలించాలని సూచించారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
నిజామాబాద్లో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఇరిగేషన్ సీఈ మధుసూదన్రావు, డీఆర్డీవో చందర్నాయక్, జడ్పీ సీఈవో గోవింద్, డీఎంహెచ్వో బాలనరేందర్, డీపీవో జయసుధ, రాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి. వెంకట మాధవరావు, ఏఎస్పీ అన్యోన్య, ఆర్డీవోలు ఎస్.శ్రీను, రాజాగౌడ్, జిల్లా వైద్యాధికారి చంద్ర శేఖర్, జిల్లా ఏరియా దవాఖాన కో-ఆర్డినేటర్ అజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తహసీ ల్దార్లు తదితరులు పాల్గొన్నారు.