మన్సూరాబాద్, మే 30: ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ను వేసుకుంటే కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధిలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిత్య సేవకుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. టీకా కోసం వచ్చే ప్రజలకు కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్య సేవకుల కోసం ప్రభుత్వం పది రోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిత్య సేవకులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు టీకా పంపిణే లక్ష్యంగా పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఏఎంహెచ్వో మంజులవాణి, నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, అనంతుల రాజిరెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.