ఆయా సంప్రదాయాల ఆధిక్యతా భావంలో అవగాహన లేని వ్యక్తులు.. ‘విజ్ఞానశాస్త్రం, ఆధ్యాత్మిక మార్గం’ అన్నవి రెండూ పరస్పర వ్యతిరేక క్షేత్రాలుగా, మార్గాలుగా భావిస్తారు. పరమ సత్యసూత్రమైన మహాదైవ విభూతిని, విశ్వహితానికి ఆధారమైన దాని ధార్మిక ప్రభావాన్ని అన్వేషించేవారు, సాధ్యమైనంతవరకు ఆచరించి, ఆత్మీకరించుకొని అనుభవించేవారు వైజ్ఞానికత, ఆధ్యాత్మికతల మధ్య విరోధాన్ని చూడరు. సామ్యతను, సహచరత్వాన్ని చూస్తారు. ముఖ్యంగా అయిదు అంశాలకు సంబంధించి వైజ్ఞానికతకు, ఆధ్యాత్మికతకు నడుమ సామాన్యత, సమానాశయం మనకు కనబడతాయి. అవి సత్యాన్వేషణ, నిష్పాక్షికత, అజ్ఞాన నిర్మూలన, లోక క్షేమం, ఆనందసిద్ధి. ‘సత్యాన్వేషణ’ అంటే ఈ జగత్తుకు మూలకారణాన్ని తెలుసుకోవడం. ‘నిష్పాక్షికత’ అంటే వ్యక్తిగతమైన లేక తమ సంఘగతమైన పూర్వాభిప్రాయాల్లో వాలిపోకుండా ఉండటం. వస్త్వాశ్రయమైన యదార్థదృష్టితో సత్యాన్ని తెలుసుకొని గౌరవించడం. దోషాలను తొలగించుకొని అవగాహనను విశదంగా విస్తృత పరచడం ‘అజ్ఞాన నిర్మూలన’. ‘లోకక్షేమం’ అంటే తన పర భేదాలను దాటి ఎల్ల లోకాలలోని సద్గుణ సంపద క్షేమాన్ని, వృద్ధిని కాంక్షించడం. జీవితాన్నే ఒక సాధనంగా జీవించే వ్యక్తుల్లో ఆత్మతృప్తి, సహజానందం విరబూయడమే ‘ఆనందసిద్ధి’. అంటే, అటు విజ్ఞానశాస్ర్తానికి కానీ, ఇటు ఆధ్యాత్మిక మార్గానికి కానీ పరమసత్యం ఆధారంగా, సముచిత ధర్మాచరణ ద్వారా ఆనందసిద్ధికి దారివేయడమే పరమాశయం.
విజ్ఞానశాస్త్రం బహిర్ముఖీనమైంది, భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చెసేది. పదార్థదృష్టితో, కొలమానాలతో అన్వేషణ సాగించేది. పరిశీలన (Observation), పరికల్పన (Hypothesis) ప్రయోగాలు, సిద్ధాంతీకరణలను మెట్లుగా గల పద్ధతి అది. పరిశోధనా ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి బహిర్గతం చేసేది. నిత్యం సత్యనిష్ఠతో సంస్కరణను ఆహ్వానించేది. ఆధ్యాత్మిక మార్గం ప్రధానంగా అంతర్ముఖీనమైంది. అమూర్తమైన చైతన్యానుభవాన్ని అధ్యయనం చేసేది. భావస్వభావంతో, అనుభవాలతో అన్వేషణ సాగేది. ఆధ్యాత్మికత రెండు విధాలు. ఒకటి: సగుణారాధనను ఆలంబనంగా చేసుకొని ఆత్మానుభూతిని విస్తరింపజేసుకొనేది. రెండవది: నిర్గుణ పరమసత్యాన్ని (పరబ్రహ్మం) జ్ఞానమార్గంలో ఆవిష్కరించుకొనేది. అయితే, ‘ఆర్షధర్మం’ ఈ రెండిటి సమ్మిశ్రమంగా అవతరించింది. ముక్తియే గమ్యంగా, వివిధ స్వభావాలకు అనుకూలంగా అనేక మార్గాలను నిర్మించింది. విజ్ఞానశాస్త్రం సాంకేతిక శాస్త్రరంగానికి ఆధారమై దాని వికాసానికి దారివేస్తుంది. సాంకేతిక శాస్త్రరంగం అటు జాత్యహంకారపు గుప్పిట్లో, ఇటు వ్యాపార దాహపు సందిట్లో బందీయై ఎంత మేలుకు కారణమవుతున్నదో అంతే హానినీ కలిగిస్తున్నది. అదేవిధంగా గుడ్డి మతాల గుప్పిట్లో పడిన ఆధ్యాత్మికత పక్షపాత బుద్ధితో వ్యాధిగ్రస్థమై విద్వేషాలను రేపుతున్నది. ప్రవచనాలు ఎంత గొప్పగా ఉన్నా ‘ఆధిక్యాంధ భావనల’తో ఆచరణలో మోక్షానుభవానికి దూరమవుతున్నది. ఈ రెండు విపరిణామాలకూ కారణం ‘ప్రేమ, కరుణ నిండిన ధర్మనిష్ఠ బలహీన పడటమే’. అది గీసే హద్దులు చెరిగిపోవడం. అహంకారం, ఇంద్రియ సుఖాపేక్ష విచ్చలవిడిగా విజృంభించడం.
కాబట్టి, మతాలు వాటి ఆచారాలను యథాతథంగా పాటించినా అవి పోషించే జీవన దృక్పథంలో వైజ్ఞానికమైన సత్యనిష్ఠ, నిష్పాక్షికత, సకలలోక క్షేమం అంతర్లీనం కావాలి. వివిధ జాతుల సమష్టి జీవనం అనివార్యమైన వర్తమానంలో ఈ లక్షణం విధిగా పెంపొందించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ, వ్యాపార రంగాల చేతుల్లో చిక్కిన విజ్ఞాన, సాంకేతిక శాస్త్రరంగాలు భౌతిక పరిధులను దాటి ఆధ్యాత్మిక పరిణతినిచ్చేలా ప్రేమ, కరుణలతో తగిన హద్దులను గీసుకోవాలి. వేగంగా చోటుచేసుకుంటున్న అనేక వికార పరిణామాల దృష్ట్యా రానున్న మరిన్ని విపత్తుల నివారణకు తనను తాను రక్షించుకోవడానికి మానవజాతి తప్పక జీర్ణింపజేసుకోవలసిన సంస్కరణ ఇది. ‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’ అన్న ఋషి అవగాహన మానవ సమాజగతిలో ధర్మస్వరూపంగా కృతజ్ఞత, ప్రేమ, కరుణగా పరిణతి చెందాలి. అదే జగతికి రక్ష!
యముగంటి ప్రభాకర్
94401 52258