సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : అనవసరంగా ఖర్చు చేసి కొంటే..రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుందన్నారు ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్. కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఆపత్కాలంలో ఇంటిని చక్కదిద్దేందుకు అతివలు పొదుపు బాట పట్టారు. ఎంత పొదుపు చేస్తే అంత మంచిదంటూ ఇంటి బడ్జెట్ను చేతుల్లోకి తీసుకుంటున్నారు. కష్టకాలంలో ఏ మాత్రం డబ్బును దుర్వినియోగం చేయకుండా ఉన్నంతలో సర్దుకుపోతూ ఇంటి నావను నడిపిస్తున్నారు. ఇదివరకు ఆదాయాన్ని ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగించే వారు. ఇప్పుడు అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే, ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే ఎంత ఖర్చవుతుందో ముందుగానే ఊహించి అందుకు సంసిద్ధంగా ఆర్థిక నిర్వహణ చేపడుతున్నారు. అనవసర ఖర్చులకు వెళ్లకుండా ఉన్నదాంట్లో జీవిస్తూ కొంత మొత్తాన్ని దాచుకుంటున్నారు.
సాధారణంగా ఓ కుటుంబం గడవాలంటే నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలు అవసరం. ఉద్యోగస్తులు మినహా సగటు కుటుంబాలకు ప్రస్తుతం ఈ ఆదాయం ఆశగానే మిగులుతోంది. చిన్న చిన్న వ్యాపారాలు, చిరు ఉద్యోగాలు చేసే వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వంటింటి సరుకుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయలు, పప్పు దినుసులు, వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో అనవసర ఖర్చులు తగ్గించి, అవసరమున్న మేరకే ఖర్చు చేస్తున్నట్లు గృహిణులు చెబుతున్నారు. పరిస్థితి కుదుట పడేవరకు సర్దుకుపోతేనే మంచిదంటున్నారు.
కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా మారిపోయాయి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా ఇంటి నిర్వహణ భారంగా మారుతోంది. ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. మారిన పరిస్థితుల దృష్ట్యా ఖర్చులు, ఆహారం, కొనుగోలు వంటి అంశాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. తక్కువ డబ్బుతో నేర్పుగా కుటుంబాలను పోషించుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. – అలేఖ్య రేచల్, గృహిణి
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత పొదుపు చేస్తే అంత మంచిది. ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలవారీ ఇంటి బడ్జెట్ను సర్దుకుంటూ ఇల్లు నెట్టుకురావడం ప్రతి గృహిణికి అనివార్యమైంది. పిల్లల చదువులు, వారి ఫీజులు, ఇతర అవసరాలు తీర్చాలంటే ఆర్థిక పరిస్థితి సరిపోవడం లేదు. కరోనా పరిస్థితులు కూడా మంచి పాఠాన్ని నేర్పుతున్నాయి. – లక్ష్మి, గృహిణి