ఎల్బీనగర్, మే 26: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. గురువారం ఉదయం ఎల్బీనగర్లో ఫ్లై ఓవర్పై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వనస్థలిపురం టీవీ కాలనీకి చెందిన హరిమూర్తి వాహనం స్కిడ్ కావడంతో రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ దారిలోనే వెళ్తున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే కారును ఆపారు. తన సిబ్బంది సహకారంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన హరిమూర్తిని పరామర్శించి అతన్ని తన కారులో తీసుకుని వచ్చి మెడిసిస్ ఆసుపత్రిలో చేర్పించారు. హరిమూర్తికి మంచి చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పారు. హరిమూర్తికి ప్రమాదం జరిగిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రస్తుతం హరిమూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.