న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తున్నది. ఈనెల 4న ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన హత్య ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి గురువారం బయటికి వచ్చింది. ఇందులో కొంతమందితో కలిసి సుశీల్.. రాణాను కట్టెలతో బాదుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. నేలపై అచేతనంగా పడి ఉన్న రాణాను చితకబాదుతున్నట్లు తెలుస్తున్నది. తీవ్రమైన గాయాలతో రాణా మరణించినట్లు వైద్యుల పోస్ట్మార్టమ్ రిపోర్టులో తేలడంతో..హత్య కేసులో సుశీల్ పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే పోలీసుల విచారణ సందర్భంగా సుశీల్..రాణాను బెదిరించేందుకు ప్రయత్నించానని చెబుతూ భవిష్యత్లో ఎవరూ కూడా తనను తక్కువ అంచనా వేయద్దనే రీతిలో వ్యవహరించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే ఇదంతా వీడియో తీయించినట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ కాలా జతేదీ సోదరుడు ప్రదీప్తో సుశీల్ కలిసి ఉన్న ఫొటో తాజాగా వైరల్గా మారింది. మూడేండ్ల క్రితం ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఢిల్లీలోని ఓ మోడల్ టౌన్లో ఫ్లాట్ విషయంలో సుశీల్, సాగర్ మధ్య వివాదం హత్యకు దారి తీసిన సంగతి తెలిసిందే.