పోలీస్ అంటే.. ఒక భరోసా.. కొండంత అండ.. ఆసరా.. ఒక నమ్మకం.. శాంతి భద్రతలను పరిరక్షించడమే కాదు.. నిస్సాహాయులకు ఆపన్నహస్తం అందించడంలోనూ వీరు ఎల్లప్పుడు ముందుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో పేదల ఆకలి తీర్చి.. గొప్ప మనసు చాటుకుంటున్నారు. మానవసేవే మాధవ సేవగా.. అభాగ్యుల కష్టాలను తీరుస్తున్నారు. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయడమే కాదు.. ఏ సమయంలోనైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి తోడ్పాటునందిస్తున్నారు. కరోనా కాలంలో మానవత్వాన్ని పరిమళింపజేస్తున్న సిటీ పోలీసుల సమాజసేవకు జనం జేజేలు పలుకుతున్నారు. ‘సరిలేరు మీకెవ్వరు’ అంటూ.. కీర్తిస్తున్నారు.
గోపాలపురం పీఎస్ కానిస్టేబుల్ ధన్రాజ్, హోంగార్డు సిద్ధిరాములు సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ సమీపంలోని చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ ముగించుకొని వెళ్తుండగా… ఓ మహిళ తాను అత్యవసరంగా కోఠిలోని ప్రసూతి దవాఖానకు హెల్త్చెక్ అప్ కోసం వెళ్లాల్సి ఉందని, ఒక్క వాహనం కూడా లేదంటూ.. ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గోపాలపురం ఎస్హెచ్వో సాయిశ్వర్గౌడ్కు సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు ఆమెను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ధన్రాజ్, సిద్ధిరాములు చేసిన సహాయానికి ఆ మహిళ కృతజ్ఞతలు తెలుపుకొన్నది. మహిళకు తక్షణ సాయమందించిన ఇన్స్పెక్టర్తోపాటు కానిస్టేబుల్, హోంగార్డును కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయానికి ప్రత్యేకంగా పిలిపించి అభినందనలు తెలిపారు. జ్ఞాపిక అందజేశారు.
ఈ నెల 12వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో న్యూబోయిగూడకు చెందిన లక్ష్మి అనే మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. లాక్డౌన్తో రవాణా సౌక ర్యం లేక..అంబులెన్స్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె పక్కింట్లో ఉండే లక్ష్మి అనే మరో మహిళ గాంధీనగర్ పోలీస్స్టేషన్కు వచ్చి విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చింది. అక్కడ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, ఎస్ఎం గౌతమ్, స్పెషల్ పోలీ స్ అఫీసర్ మీరావలీ ఆ గర్భిణిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి కింగ్ కోఠి మెటర్నిటీ దవాఖానలో చేర్పించారు. వీరి సేవా స్ఫూర్తిని ఉన్నతాధికారులు ప్రశంసించారు.
పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేశ్కుమార్ సోమాజిగూడ రోడ్డులో వెళ్తుండగా, ఇద్దరు పిల్లలు ఆకలితో ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని చూశాడు. తన కోసం తెచ్చుకున్న భోజనాన్ని ఆ ఇద్దరు పిల్లలకు స్వయంగా తినిపించాడు. దీంతో కానిస్టేబుల్ మహేశ్ ఉదారతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఆపదలో ఉన్న వారికి తోడ్పాటునందిస్తే లభించే సంతృప్తే వేరు. కరోనా రెండో వేవ్తో బాధితులు పడుతున్న ఇక్కట్లు వర్ణణాతీతం. వారికి నా వంతుగా సహాయపడాలన్న ఉద్దేశంతో నిత్యావసరాలు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నా. ఇలా పంచడం వల్ల మనసుకు ఎంతో తృప్తినిస్తున్నది. – పరావస్తు మధుకర్ స్వామి, సీఐ, కార్ఖానా
హయత్నగర్ పోలీసులు బుధవారం 12 మంది యాచకులకు కరోనా టెస్టులు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారిని హయత్నగర్లోని ప్రభుత్వ దవాఖానకు, మిగతా వారిని దుండిగల్లోని ఓల్డ్ ఏజ్ హోంకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ నర్సిరెడ్డి, సిబ్బందితో కలిసి యాచకులకు కొవిడ్ పరీక్షలు చేయించామన్నారు.
ఆయన పేరు పరావస్తు మధుకర్ స్వామి. కార్ఖానా పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్. పోలీస్ ఉద్యోగం వచ్చిన తొలినాళ్ల నుంచి పేదల కోసం ఎంతో కొంత వెచ్చిస్తున్నారు. ఆయన ఆలోచనలు ఎప్పుడు సమాజ సేవ వైపే.. అలా ‘పరావస్తు ఫౌండేషన్’కు పునాదిపడింది. సుమారు రెండున్నర సంవత్సరాల కిందట హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కార్ఖానా స్టేషన్కు బదిలీపై వచ్చిన నాటి నుంచి.. అటు శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే.. ఇటు స్టేషన్కు వచ్చే బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అభాగ్యుల ఆకలి తీర్చారు. ప్రతిరోజూ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సుమారు 3 నుంచి 4వేల మందికి ఉచితంగా భోజనాలు అందించారు. ప్రస్తుతం రెండో వేవ్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతుగా సేవ చేసేందుకు కదిలారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు బస్తీల్లోని పేదలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తన సేవా నిరతిని చాటుకుంటున్న ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామిని డీజీపీ మహేందర్రెడ్డి., నగర సీపీ అంజనీకుమార్, నార్త్జోన్ డీసీపీ కళ్మేశ్వర్ ప్రశంసించారు.