మహబూబ్నగర్ మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు.. వైద్య సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన దాదాపు 140 మంది మరో పది పదిహేను రోజుల్లో ఫలితాలు రాగానే.. హౌస్సర్జన్లుగా దవాఖానల్లో వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. కరోనా కారణంగా దవాఖానల్లో వైద్యుల అవసరాన్ని గుర్తించిన వారు.. ముందే హౌస్సర్జన్లుగా సేవలకు సిద్ధమయ్యారు. సీనియర్ వైద్యులకు తమవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వీరికి అధికారులు ముందుగా వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వారందరికీ అక్కడే వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రసూతి, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, ఐసీయూ, కాజువాలిటీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాలతోపాటు బస్తీ దవాఖానల్లోనూ వీరి సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయి ఇంక్యుబేషన్ పిరియడ్ ముగిశాక కొవిడ్ వార్డుల్లోనూ వారిసేవలు వినియోగించుకోనున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గతంలో రూ.19,527 ైస్టెపెండ్ ఉండగా.. ప్రభుత్వం ఇటీవలే దాన్ని రూ.22,560కు పెంచింది. ఫలితాలు వచ్చాక హౌస్సర్జన్లుగా ైస్టెపెండ్ ఇవ్వడం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. మేం మెడిసిన్ చదువుతున్నామంటే అది మాకు ప్రభుత్వం కల్పించిన అవకాశమే. ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని.. మమ్మల్ని సేవలందించమని ప్రభుత్వం చెప్పింది. సంతోషంగా మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.
-అతుల్య, కరీంనగర్, ఫైనలియర్ విద్యార్థిని, మహబూబ్నగర్ మెడికల్ కళాశాల
ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేందుకు సైతం భయపడే పరిస్థితి. మా ప్రొఫెసర్లు ఎంతో కష్టపడుతున్నారు. వారిచేస్తున్న దాంతో పోలిస్తే మేం చేసేది చాలా తక్కువే. మా వైద్యకళాశాల నుంచి హౌస్సర్జన్లుగా మొదట మేమే ఉన్నాం. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇచ్చారు. క్లిష్టసమయంలో వైద్యసేవలందించే అవకాశం రావడం మా అదృష్టం.
-శ్రీసౌమ్య, హైదరాబాద్, ఫైనలియర్ విద్యార్థిని, మహబూబ్నగర్ మెడికల్ కళాశాల
మాకు పిలుపు రాగానే ప్రభుత్వ జనరల్ దవాఖానలో వైద్యసేవలందించేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చాం. ఉన్నతాధికారుల సూచన మేరకు ఎక్కడ డ్యూటీలు వేసినా చేస్తాం. నేర్చుకునేందుకు కూడా మాకు చక్కని అవకాశం దక్కడం అదృష్టం. జనరల్ దవాఖానతోపాటు బస్తీ దవాఖానల్లోనూ పనిచేయాలని ఉన్నది.
-ఆరిఫ్, హైదరాబాద్, ఫైనలియర్ విద్యార్థి, మహబూబ్నగర్ మెడికల్ కళాశాల
కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి 15నెలలుగా ప్రభుత్వ జనరల్ దవాఖానలోని వైద్యులు నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. చాలామందికి పాజిటివ్ వచ్చినా చికిత్స పొంది మెరుగయ్యాక తిరిగి విధుల్లోకి వచ్చారు. ఇలాంటి సమయంలో ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులు దవాఖానలో పనిచేసేందుకు రావడం వల్ల ఎంతో వెసులుబాటు కలుగుతుంది. వీరిరాకతో వైద్యులపై ఒత్తిడి తగ్గుతుంది. మరింత మంది కరోనా రోగులకు సేవలు అందించేందుకు వీలవుతుంది. వైద్యవిద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటాం.
-డాక్టర్ రాంకిషన్,సూపరింటెండెంట్, జనరల్ దవాఖాన, మహబూబ్నగర్