లాక్డౌన్, జ్వర సర్వేతో తగ్గుముఖం పడుతున్న కేసులు
ఈ నెల 12వ తేదీన కొత్తగా 161 నమోదు..25న 116 మాత్రమే
ఇక 22,23 తేదీల్లో గణనీయంగా తగ్గుదల
మంచిర్యాల, మే 26, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతున్నది. మరోవైపు జ్వర సర్వేకు తోడు అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాగా, వైరస్ ఉధృతికి బ్రేక్ పడుతున్నది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఈ నెల 12వ తేదీన 161, 17న 122 కేసులు నమోదు కాగా, 23న ఆ సంఖ్య గణనీయంగా తగ్గి 46కు చేరింది.
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్తో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడుతున్నది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. నియంత్రణలో భాగంగా నిర్వహిస్తున్న జ్వర సర్వే సత్ఫలితాలిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే, వైద్య సేవలు (వ్యాక్సినేషన్), లాక్డౌన్ (త్రిముఖ వ్యూహం) పటిష్టంగా అమలుతో జిల్లాలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. లాక్డౌన్ అమలు చేస్తున్న ఈ నెల 12వ తేదీ నుంచి నమోదవుతున్న పాజిటివ్ కేసులు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు తగ్గుతూ వస్తున్నది. 12న జిల్లావ్యాప్తంగా 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25న ఆ సంఖ్య 116కు చేరింది.
12న 161 కేసులు.. .. 25న 116..
కరోనా రెండో దశలో పట్టణాలతో పాటు గ్రామాలు, పల్లెలకు సైతం వైరస్ వేగంగా విస్తరించింది. పాజిటివ్ బారిన పడిన వారు పెరుగుతుండడంతో దవాఖానల దారి పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కొవిడ్ నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ హాస్పిటళ్ల పైనా పర్యవేక్షణ పెంచింది. జ్వర సర్వే కూడా చేపట్టడంతో కరోనా ఉధృతికి బ్రేక్ పడింది. ఇదే సమయంలో లాక్ డౌన్ను కూడా పకడ్బందీగా అమలు చేస్తుండడంతో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. లాక్డౌన్ అమలు తెచ్చిన మే 12న కరోనా బాధితులు 161 మంది ఉన్నారు. వారం రోజుల తర్వాత 17న తేదీన 122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈనెల 23న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి 46కు చేరింది. మళ్లీ పెరుగుతూ ఈ నెల 25న ఈ సంఖ్య 116 కు చేరింది. ప్రభుత్వం అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్కు ముందు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో పాటు సమీప జిల్లాల నుంచి కూడా కరోనా బాధితులు రావడంతో జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దవాఖానలు కూడా కిటకిటలాడాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో పటిష్ట నిఘా, కర్ఫ్యూ అమలుతో పాజిటివ్ కేసులు జిల్లాకు రావడంలేదు. దీంతో హాస్పిటళ్లలోనూ బెడ్స్ ఖాళీగానే ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
సత్ఫలితాలిస్తున్న సర్వే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జ్వర సర్వే సత్ఫలితాన్నిస్తున్నది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతున్నది. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నది. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఉచితంగా మందులు అందిస్తున్నది. నాలుగు రోజులూ పరిశీలించి తగ్గని వారికి దవాఖానల్లో పాజిటివ్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నది. పరిస్థితిని బట్టి హోం ఐసోలేషన్లో ఉంచుతూ మందులు సరఫరా చేస్తున్నది. ఆరోగ్యంపై రోజూ ఆరా తీస్తున్నది. దీంతో దవాఖానలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ఆరోగ్యం క్షీణించిన వారిని మెరుగైన వైద్యం కోసం దవాఖానలలో చేర్పించి వైద్య సేవలందిస్తున్నది. లాక్డౌన్ పకడ్బందీగా అమలు, వ్యాక్సినేషన్, జ్వర సర్వే వంటి త్రిముఖ వ్యూహంతో ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నది.