ఉప్పల్, మే 23: ఐస్క్రీం తిన్న కొద్దిగంటలకే ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారం సీఐ కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం వీఎస్టీకాలనీకి చెందిన సాయిసంపత్(20) ఈనెల 20న ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా జొమోటోలో అర కేజీ ఐస్క్రీం ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఐస్క్రీం తిన్న సాయికి మరుసటి రోజు వాంతులు, విరోచనాలు అయ్యాయి. బాత్రూంకు వెళ్లిన సాయిసంపత్ శ్వాస సరిగా రావడంలేదని తల్లికి చెప్పడంతో 108కు సమాచారం అందించారు. 108చేరుకునే లోపే అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మిగిలిపోయిన ఐస్క్రీంను ల్యాబ్కు పంపించామని, పోస్టుమార్టం రిపోర్టు ద్వారా కారణాలు తెలుస్తాయని సీఐ తెలిపారు.