గిరిజన గ్రామాల్లోని మహిళలు, గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్
మహబూబాబాద్, మే 15 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో కొవిడ్ బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసం నుంచి మహబూబాబాద్, ములు గు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీ మండలాల్లో నివాసముండే మహిళలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వీడియో, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించాలన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించి కరోనా బాధితులకు ధైర్యాన్ని నింపాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో ఆయా జిల్లాల్లో పర్యటించి దవాఖానల్లో సౌకర్యాలను తనిఖీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఏ సమస్య ఉన్నా తనను సంప్రదిస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.