చుక్కలు చూపిస్తున్న పండ్ల ధరలు
సీ విటమిన్ పండ్లకు భారీ డిమాండ్
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ‘పండ్లు తినండి.. రోగ నిరోధకశక్తి పెంచుకోండి’ కరోనాకాలంలో డాక్టర్లతోపాటు ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు. మాట బాగనే ఉన్నది కానీ.. కొనడానికి వెళితే పండ్ల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. కరోనాకు ఎంత భయపడాల్సి వస్తున్నదో.. పండ్ల ధరలు చూసినా అంతే భయం కలుగుతున్నది. ప్రజల అవసరాలతో రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పండ్లు తినాలంటే జేబు ఖాళీ అయిపోతున్నది. ఏ రకం పండ్లు కొనాలన్నా.. వందల్లో ఖర్చు తప్పడం లేదు. నాలుగైదు వందలు పెడితే కానీ రెండు మూడు రకాల పండ్లు రాని పరిస్థితి నెలకొన్నది. ఒక్కో కుటుంబం పండ్ల కోసమే వారానికి కనీసం రూ.500 నుంచి వెయ్యి వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ డిమాండ్.. పెరిగిన ధరలు
మామూలుగానే ఎండాకాలంలో పండ్ల ధరలు అధికంగా ఉంటాయి. దీనికితోడు ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ధరలు మరింత పెరిగాయి. రోగ నిరోధకశక్తికి పండ్లు కీలకం కావడంతో అందరూ వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పెద్దగా ఆసక్తి చూపనివారు సైతం శ్రద్ధగా పండ్లు తింటున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సీ-విటమిన్ లభించే బత్తాయి, నారింజ, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ, ద్రాక్ష, యాపిల్ తదితర పండ్ల ధరలు చుక్కల్లో ఉన్నాయి. రూ.100 పెడితే కానీ అరడజన్ నారింజ పండ్లు రావడం లేదు. రెండు నెలల క్రితం రూ.10కి ఒక నారింజ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రేట్కు అడుగుతుంటే వింతగా చూస్తున్నారు. రూ.50 పెడితే గానీ ఒక్క దానిమ్మ రావడం లేదు. ఒక్కో కివీ ఫ్రూట్ ధర రూ.30-40 మధ్య పలుకుతున్నది. బొప్పాయి కేజీ రూ.60-80 ఉంటున్నది. ఇక జామకాయలు కిలో రూ.60-70 వరకు చెప్తున్నారు. ద్రాక్ష కేజీ రూ.100-120 దాటిపోతున్నది. ఇక ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న అల్లనేరేడు పండ్లు కేజీ రూ.150-200 పలుకుతుండడం గమనార్హం. మొన్నటి వరకు భారీగా ధర పలికిన మామిడి పండ్లు.. మార్కెట్లోకి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో ఇప్పుడిప్పుడే కాస్త అగ్గువలో దొరుకుతున్నాయి. గతంలో కిలో రూ.100-120 పలికితే.. ఇప్పుడు రూ.60-80 మధ్య లభిస్తున్నది. పుచ్చకాయ ధరలు మాత్రం కాస్త అందుబాటులో ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇది కేజీ రూ.20-30 పలుకుతున్నది.
వామ్మో కొబ్బరిబోండం
కొబ్బరి బోండం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు రూ.30-35 పలికిన ధర ఇప్పుడు రూ.50 కి పెరిగిపోయింది. కేరళ కొబ్బరి బోండం కావాలంటే రూ.60 పెట్టాల్సిందే. ఈ నెలాఖరు వరకు కొబ్బరి బోండం ధరలు రూ.70-80 వరకు పోయినా అశ్చర్యపోనవసరం లేదని ఓ వ్యాపారి వ్యాఖ్యానించడం గమనార్హం.
వారంలో 1.50 లక్షల టన్నులు..
రాష్ట్రంలో పండ్లకు భారీ డిమాండ్ ఉంటున్నది. అదే స్థాయిలో దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్కు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల నుంచి పండ్లు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరెంజ్, బత్తాయి, మామిడి, కివీ, యాపిల్ పండ్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అన్ని పండ్లు కలిపి గత వారం రోజుల్లో గడ్డిఅన్నారం మార్కెట్కు దాదాపు 1.50లక్షల టన్నులు రావడం గమనార్హం. మనవద్ద తక్కువగా పండే, ఎక్కువ డిమాండ్ గల నారింజ, యాపిల్, కివీ ఫ్రూట్స్ వంటివాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కివీ పండ్లను న్యూజిలాండ్, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ నుంచి, ఆరెంజ్ పండ్లను అమెరికా, ఈజిప్టు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి మన రాష్ర్టానికి వచ్చిన పండ్ల కొనుగోలుకు ఇతర రాష్ర్టాల వ్యాపారులు కూడా పోటీ పడుతుండటం విశేషం.