న్యూఢిల్లీ: కరోనా తొలిసారి వచ్చినప్పుడు ఇండియన్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. మిగతా దేశాలను వణికించినట్లు కరోనా ఇండియాను వణికించలేకపోయిందని, ఈ మహమ్మారిపై భారత్ గెలిచినట్లేనని చాలా మంది భావించారు. అయితే ఊహించని విధంగా సెకండ్ వేవ్ విరుచుకుపడింది. రోజురోజుకూ లక్షల సంఖ్యలో కేసులతో తన రికార్డులనే తానే బద్ధలు కొడుతోంది ఇండియా. ప్రస్తుతం దేశంలో కొవిడ్ రీప్రొడక్టివ్ రేటు 1.44గా ఉంది. అంటే ఒక వ్యక్తి మరో ఒకటిన్నర వ్యక్తికి కరోనాను అంటిస్తున్నారు. మరి ఈ స్థాయిలో కేసులు వస్తున్నాయంటే దేశం ఇక హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లేనా? దీనిపై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు?
అసలు ఏంటీ హెర్డ్ ఇమ్యూనిటీ?
ఒక దేశం లేదా ప్రాంతంలోని మొత్తం జనాభాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి సదరు రోగం అంటుకోకుండా వ్యాక్సిన్లు వేయడం లేదా ఇప్పటికే అంతమంది దాని బారిన పడి యాంటీబాడీలు వృద్ధి చెందితే దానిని హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అంటారు. అలా అయినప్పుడు వైరస్ సోకిన వాళ్లు ఇతరులకు దానిని వ్యాప్తి చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో క్రమంగా వైరస్ కనుమరుగవుతుంది.
మరి ఇండియా పరిస్థితి ఏంటి?
ఇండియాలోని ప్రధాన నగరాల్లో దీనికి సంబంధించి సేరో సర్వేలు జరిగాయి. ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లు చాలా మందే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది హెర్డ్ ఇమ్యూనిటీగా మారడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో వస్తున్న కేసులను చూస్తే ఇప్పటికే దేశ రాజధాని హెర్డ్ ఇమ్యూనిటీని సాధించాల్సింది. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు. ఢిల్లీలో ఇప్పటికే 50-60 శాతం మందిలో కరోనా యంటీబాడీలు వృద్ధి చెందాయి. ఆ లెక్కన హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి ఉండాలి. కానీ అది జరగలేదని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా చెబుతున్నారు.
ఐసీఎంఆర్ నిర్వహించిన తాజా సేరో సర్వేలో ఇండియాలోని మొత్తం వయోజనుల్లో 21 శాతం మంది కరోనా బారిన పడినట్లు తేలింది. 18 ఏళ్లు నిండిన మొత్తం 28,589 మందిపై సర్వే నిర్వహించగా.. అందులో 21.4 శాతం మందికి కొవిడ్ సోకినట్లు స్పష్టమైంది. ఆ లెక్కన ఇండియా హెర్డ్ ఇమ్యూనిటీకి ఇంకా చాలా చాలా దూరంలోనే ఉంది. ఇన్ఫెక్షన్తోనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందనుకోవడం పొరపాటు. వ్యాక్సినేషనే దీనికి ఏకైక మార్గం అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎపిడమాలజిస్ట్ గిరిధర్ బాబు అన్నారు.