: గ్రేటర్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అడుగు బయట పెట్టాలంటేనే జనాన్ని వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ లక్షణాలుంటే ఏం చేయాలి? అత్యవసరంలో ఆసుపత్రులలో ఆక్సిజన్, రెమ్డెసివర్లు అందుబాటులో ఉన్నాయా? హోం ఐసోలేషన్లో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం 040-2111 1111ను ఏర్పాటు చేయగా, ఈ కేంద్రం సత్ఫలితాన్ని ఇస్తోంది. ఈ కంట్రోల్ రూమ్కు కేటాయించిన నంబర్కు రోజూ వందల సంఖ్యలో బాధితులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారి సందేహాలను శ్రద్ధగా వింటున్న సిబ్బంది వాటికి నివృత్తి చేస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాల ని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 250 మంది ఫోన్ చేశారు. ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు వీరికి తగు సలహాలు, సూచనలు అందించారు.
గ్రేటర్లో కొవిడ్ సంబంధిత వైద్య సహాయాన్ని, కొవిడ్ పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు, సూచనలు అందించేందుకు జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూం నుంచి వైద్యులు పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గం టల నుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి రెండు నుం చి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టులలో వైద్యులు కంట్రోల్ రూం నుంచి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.