పల్లెప్రగతితో అద్దంలా మెరుస్తున్న గ్రామాలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సూర్యాపేట రూరల్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని గ్రామాలు పచ్చని పరిశుభ్ర వాతావరణంలో అద్దంలా మెరుస్తున్నాయి. సూర్యాపేట మండలంలో 23గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. గ్రామాల్లో పచ్చని వాతావరణం కోసం మొక్కలు నాటడం, ఆహ్లాదం కోసం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి రెండ్రోజులకు ఒకసారి ఇంటింటికీ తిరిగి ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించడంతో పాటు మురుగు కాల్వలను శుభ్రం చేసి పరిశుభ్ర వాతావరణాన్ని కల్పిస్తున్నారు. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లోని వీధుల్లో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. పల్లెప్రగతితో ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తుండడంతో ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఉమ్మడి పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందకుండా అంధకారంలో ఉన్నాయని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.