వార్డుకు ప్రత్యేక బృందాలు
దృష్టిసారించిన పురపాలిక శాఖ
మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 21: ఇంటింటికీ చెత్త సేకరణ పెరగాలి.. పట్టణంలో చెత్త కనిపించొద్దు.. పెరుకపోయిన చెత్తను తీసేయాలి.. అంటూ బల్దియా అధికారులకు ఇటీవల రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయం విధితమే.. మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించడంతో పట్టణంలో పారిశుధ్య నిర్వహణ జోరుగా సాగుతున్నది. మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని అన్నివార్డులు, ప్రధాన కూడళ్లలో ఎక్కడ కూడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడూ తొలగిస్తున్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు
కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న ప్రస్తుత సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికార యంత్రాగం చర్యలు తీసుకుంటున్నది. వివరాల్లోకెళితే.. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చెత్తను తొలగిస్తూ.. ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోల నుంచి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య విభాగం సిబ్బంది ఇంటింటికీ తిరిగి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. పరిస్థితి విషయంగా ఉన్న చోట అధికారులు ప్రత్యేక దృష్టిసారించి.. ప్రజలకు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి శానిటైజర్లను ఉపయోగించాలని చెబుతున్నారు.