శ్రీశ్రీ త్రిదండి చిన శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో భగవత్ రామానుజుల 1004వ తిరునక్షత్ర మహోత్సవాన్ని వైభవంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని శ్రీ రామనగరంలో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. దివ్యసాకేతంలో స్వామి వారి పెరుమాళ్లకు తిరువారాధన, సేవాకాలం కార్యక్రమాలు జరిపారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయని ఆశ్రమ ప్రతినిధులు తెలిపారు. వేద పండితులు శాస్ర్తోక్తంగా అభిషేక ప్రోక్షణ చేశారు. ప్రతిరోజు ఉదయం శ్రీ చినజీయర్ స్వామివారి శ్రీరామానుజ వైభవం ప్రవచనం, వసంత నవరాత్రోత్సవాలు, 19, 20 తేదీల లో శ్రీరామాయణ వైభవ ప్రవచనం, 21న ఉదయం 10 గంటలకు శ్రీసీతారామ కళ్యాణోత్సవం ఉత్సవాలు ఆన్లైన్ ద్వారా వీక్షించవచ్చన్నారు. శ్రీ చిన జీయర్ ప్రసంగిస్తూ భగవంతుడు సర్వాంతర్యామియని, భగవదనుగ్రహం అందరికీ సమానంగా అందుతుం దని ఉద్బోధించారు. 1000 ఏళ్ల క్రితమే భగవత్ రామానుజులు సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు అనేక ధా ర్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉద్యమించారని వివరించారు. జాతి, కుల భేదాలు సమాజంలో సహజంగా ఉంటాయని, వాటిని దూరం చేయగలిగినవి ఆలయాలు మాత్రమేనని సమాజానికి తెలియజేసిన సంఘ సంస్కర్తగా దీన జనోద్ధరణకు కృషి చేశారని తెలిపారు. భగవంతుని సృష్టిలో మానవ జన్మ ఉత్తమోత్తమైనదన్నారు. అంతటి మహోన్నతమైన మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు భగవంతుని సేవతో పాటు మానవ సేవ సరియైన మార్గాలన్నారు.