హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో లక్షల మంది సొంతింటి కల సాకారం అవుతున్నది. 2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించింది. ఇందులో 1,02,260 ఇండ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా, 54,313 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 2,86,057 ఇండ్లు మంజూరవగా ప్రభుత్వం రూ.10,054.94 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది.
ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వ స్థలంలోనే నిర్మించి ఇచ్చింది. మిగిలినవారికి ఇవ్వడానికి స్థలం పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం.. స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.11వేల కోట్లు కేటాయించింది. వాస్తవానికి గతేడాదే దీన్ని అమలుచేయాల్సి ఉండగా.. కరోనా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కొద్దిగా పుంజుకుంటున్న పరిస్థితుల్లో హామీని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లబ్ధిదారులుగా ఎంపికైన స్థలం కలిగి ఉన్నవారు ఈ దఫా తమకు ఇల్లు వస్తుందని వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతోపాటు కొత్తగా చాలామంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
స్థలం కలిగి ఉండి ఇళ్లు లేనివారికి నిర్మించడంపై విధివిధానాలు సిద్ధంచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు ఇంకా స్పష్టత రాలేదని, కసరత్తు చేస్తున్నామని తెలంగాణ గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతంలో ఎంపిక చేసినవారిలో ఎంత మందికి కట్టిస్తారు, కొత్తగా ఎంతమందిని ఎంపిక చేస్తారనే వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
సంవత్సరం మంజూరైన ఇండ్లు పూర్తయిన ఇండ్లు 90% పూర్తయిన ఇండ్లు మొత్తం పూర్తి ఖర్చు రూ.కోట్లలో
2016-17 2,62,336 1514 – 1514 173.31
2017-18 11,640 8,495 – 8,495 1466.02
2018-19 6,640 12,043 – 12,043 3601.24
2019-20 2,785 17,470 – 17,470 2353.97
2020-21 2,656 14,791 1,02,260 1,17,051 2460.40
మొత్తం 2,86,057 54,313 1,02,260 1,56,573 10054.94