ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత శతకాన్ని క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోరు. సంజూ కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ను గెలిపించలేకపోయినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఒత్తిడిలోనూ అద్వితీయ పోరాటంతో ఆఖరి వరకు క్రీజులో ఉండి సూపర్ సెంచరీ సాధించిన శాంసన్ అరుదైన ఫీట్ సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా ఆడిన తొలి మ్యాచ్లోనే శతకం బాదిన మొదటి ఆటగాడిగా శాంసన్ నయా రికార్డు సృష్టించాడు. పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శాంసన్(119: 63 బంతుల్లో 12 ఫోర్లు, 7సిక్సర్లు) శతకం వృథా అయింది. జట్టును గెలిపించేందుకు ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ 4 పరుగుల తేడాతో గెలిచింది. శాంసన్ వీరోచిత పోరాటంపై క్రికెటర్లు, పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.