న్యూఢిల్లీ: ముగ్గురు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో వారు తమ నివాసాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం నమోదైన కేసులు అన్ని రికార్డులను బ్రేక్చేసింది. తొలిసారి ఢిల్లీలో అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 10,774 కరోనా కేసులు, 48 మరణాలు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,25,197కు, మరణాల సంఖ్య 11,283కు పెరిగింది.
మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంలో ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులలో పడకల కొరత నెలకొన్నదని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో కనీసం మూడు వేలకుపైగా అదనపు పడకలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి ఇంకా దిగజారితే లాక్డౌన్ విధించక తప్పదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.