హైదరాబాద్ : ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నెలకు రూ. 2000, 25 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రైవేటు టీచర్లు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అంబర్పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ప్రయివేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం గమనించి, ఆర్థిక సాయం, బియ్యం అందించేందుకు నిర్ణయం తీసుకన్నారని తెలిపారు. సీఎం నిర్ణయంతో ప్రయివేటు టీచర్ల కుటుంబాలకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు బడేసాబ్, ఉపాధ్యాయులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రమేష్, సురేష్, రాఘవేంద్ర, వాసవి, ఇందిరా, శైలజ, కావ్య, వరకుమారి తదితరులు పాల్గొన్నారు.