నిర్విఘ్నంగా సంక్షేమ ఫలాలు
త్రిఫ్ట్ పథకం కొనసాగింపు
తాజాగా రూ.12 కోట్లు మంజూరు
16 వేల మందికి లబ్ధి
ఆనందంలో నేత కార్మికులు
ఆదుకున్న సర్కారుకు కృతజ్ఞతలు
రాజన్న సిరిసిల్ల ఏప్రిల్4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం నేతన్నల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నది. ఉపాధి దొరక్క ఉసురు తీసుకుంటున్న కార్మికుల తలరాత మార్చేందుకు సంకల్పించింది. ఆరేండ్లలో అనేక పథకాలు అమలు చేసింది. నేతకార్మికులకు చేతినిండా పని కల్పించాలనే లక్ష్యంతో సుమారు రూ.460 కోట్ల విలువైన వస్ర్తోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. కార్మికులను పొదుపు బాట పట్టించాలనే ఉద్దేశ్యంతో త్రిఫ్ట్ పథకం (తెలంగాణ వీవర్స్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్)ను అమలు చేస్తున్నది. ఇందులో లబ్ధిదారు నెలకు రూ.600 చెల్లిస్తుండగా అంతే మొత్తంలో సర్కారు వారి ఖాతాల్లో జమ చేస్తున్నది. మూడేండ్ల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తున్నది. గతేడాది లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన నేత కార్మికులకు ముందే చెల్లింపులు చేసి ఆదుకున్నది. ఈ ఏడాది రూ.12 కోట్లు మంజూరు చేసి నేతన్నల జీవితాలకు భరోసా నిచ్చింది.
ఉమ్మడి పాలనలో తీరని అన్యాయం
ఉమ్మడి పాలనలో నేతకార్మికులకు అడుగడుగునా అన్యాయం జరిగింది. ముఖ్యంగా మరమగ్గాల పరిశ్రమను చేనేత జౌళి శాఖ పరిధిలో చేర్చడంతో పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వీటికి ఈ యేడు బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించింది. బతుకమ్మ చీరెలు, స్కూల్ యూని ఫాంలు, రంజాన్, క్రిస్మస్ వస్ర్తాల తయారీ ఆర్డర్లు సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకే ఇచ్చింది. సర్కారు దన్నుతో ఇక్కడి కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగాయి. వలస వెళ్లినవారు వాపస్ వచ్చి ఇక్కడే పనిచేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.
కార్మికులకే యార్న్ సబ్సిడీ
లాక్డౌన్ కాలంలో మరమగ్గాలు బంద్ కావడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. వీరి దయనీయస్థితిని గుర్తించిన మంత్రి కేటీఆర్ యార్న్ సబ్సిడీ కింద రూ.18 కోట్లు (10 శాతం నిధులు) మంజూరు చేయించి వెంటనే నిధులు విడుదల చేయించారు. అలాగే, బ్యాంకర్లతో మాట్లాడి త్రిఫ్ట్ పథకం కింద పొదుపు మొత్తాన్ని కార్మికులకు ఇప్పించారు.
నెలనెలా రూ.1200 జమ
సమైక్య పాలకులు రద్దు చేసిన త్రిఫ్ట్ పథకాన్ని కార్మికుల్లో పొదుపు భావనను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2017లో పునఃప్రారంభించింది. ఈ పథకం కింద కార్మికుడు సంపాదించిన కూలీలో నెలకు రూ.600 (8 శాతం) చెల్లించాలి. ప్రభుత్వం మరో రూ.600(8 శాతం) కలిపి కార్మికుడి ఖాతాల్లో జమ చేస్తున్నది. వడ్డీతో సహా మూడేండ్ల తర్వాత తీసుకొనే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్లు కేటాయించింది. చేనేత జౌళి శాఖ అధికారులు కార్మికులతో ఖాతాలు తీయించి ఈ పథకంలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం 16 వేల మంది లబ్ధిపొందుతున్నారు. ఇందులో 15 వేల మందికిపైగా మరమగ్గాల కార్మికులు ఉన్నారు.
దరఖాస్తు చేసుకోండిలా..
త్రిఫ్ట్ పథకంలో చేరాలనుకునే కార్మికులు చేనేత జౌళిశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తు ఫారంలో ఇంటి చిరునామా, పనిచేస్తున్న కార్ఖానా, సాంచాలు, జియోట్యాగ్ చేసిన యూనిక్ నంబర్, వేతనం వివరాలు పొందుపరుచాలి. ఆధార్కార్డు, చేనేత జౌళి శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్సు పత్రాలు జతచేయాలి. సాంచాలు, డయ్యింగ్, సైజింగ్, వార్పిన్, జాఫర్, భీములు నింపడం, మాస్టర్, హెల్పర్, టెక్నీషియన్, డిజైనింగ్, వృత్తిలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్న వివరాలు తెలియజేయాలి.
ఇవి కూడా చూడండి..
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యం 50శాతమే..