నూతన అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసిన జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్
మనోహరాబాద్, ఏప్రిల్ 3 : మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. శనివారం మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రహారంలో రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టి.. పెద్ద అయ్యేవరకు ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. బాలింతలకు పౌష్టికాహారంతోపాటు మెరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ చేయించి ఆడపిల్ల పుడితే రూ.14 వేలు, మగపిల్లాడు పుడితే రూ.13 వేలతోపాటు కేసీఆర్ కిట్ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అంగన్వాడీలకు నేడు మహర్దశ పట్టిందన్నారు. జడ్పీ నిధులతో ప్రతి గ్రామంలో పక్కా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. మనోహరాబాద్ మండలంలో జీడిపల్లి, మనోహరాబాద్, గౌతోజిగూడెం, వెంకటాపూర్ అగ్రహారం గ్రామాల్లో పక్కా అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్, డిప్యూటీ ఈఈ నర్సింహులు, సీడీపీవో హేమాభార్గవి, ఎంపీపీ పురం నవనీత, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ రేణుక, జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకుడు చంద్రశేఖర్, నాయకులు ఆంజనేయులు, పెంటాగౌడ్, నాగరాజు, నాగిరెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.