డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు
ఖమ్మం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సహకార బ్యాంకు నిధులను గానీ, ట్రస్టు నిధులను గానీ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు నిరూపణ జరిగితే తనను, తన కుటుంబ సభ్యులను ఖమ్మం మయూరిసెంటర్లో ఉరి తీయాలని డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు అన్నారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన హయాంలో ఏర్పాటైన రైతు సంక్షేమ ట్రస్టు, ఆసుపత్రి.. సహకార బ్యాంకు నిధులతో ఏర్పాటు చేసినవి కావని, రైతులు స్వచ్ఛందంగా రూ.500 ఇచ్చారని, ఇంకా అనేక మంది స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారని అన్నారు. సహకార అదనపు రిజిస్ట్రార్ ఇచ్చిన విచారణ నివేదికలో నిబంధనల ఉల్లంఘన, నిధుల దారి మళ్లింపు మాత్రమే జరిగిందని ఉందన్నారు. నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఎక్కడా పేర్కొనలేదని గుర్తుచేశారు. రైతుల సంక్షేమం కోసం కొన్ని సందర్భాల్లో నిబంధనలను తోసి రాజని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సహకార చటాలను పూర్తిస్థాయిలో సవరించకపోతే సహకార బ్యాంకులు మన జాలవని అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా పాలక మండలి సభ్యుల ఆమోదంతోనే, సమష్టిగానే తీసుకున్నానని అన్నారు. ఇందుకు మినిట్స్ బుక్సే సాక్ష్యమన్నారు. తన హయాంలో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించినా జైలుకు వెళ్లడమే కాకుండా తన ఆస్తులను అమ్మి డబ్బు చెల్లిస్తానని అన్నారు. సహకార సంఘాల సభ్యులు మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం తొలుత రూ.5 వేలు ఇచ్చేవారని, కానీ తాము ఆ మొత్తాన్ని మరో రూ.5 వేలు పెంచి మొత్తం రూ.10 వేలు ఇచ్చామని అన్నారు. ఈ అంశాన్ని నిబంధనల ఉల్లంఘనగా చూపించారని, ఇది రైతుల కోసం ఉల్లఘించిన నిబంధనేనని అని అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజకీయ వేధింపుగానే భావిస్తున్నానని విజయ్బాబు అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు.