హైదరాబాద్ : తెలంగాణ పంచాయితీ కార్యదర్శుల సంఘం డైరీని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో డైరీని ఆవిష్కరించి, మాట్లాడారు. జూనియర్ పంచాయతీ అధికారులకు వేతనాలు పంచాయతీ అధికారులతో సమానంగా ఇస్తున్నారన్నారు. ఇంకా కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా.. స్పందించిన ఆయన ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, పంచాయతీరాజ్ సర్వీస్ అధ్యక్షుడు కే రాఘవేందర్రావు, ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు సత్తయ్య, మినిస్టీరియల్ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.