జూబ్లీహిల్స్, మార్చి 28: చెత్త సేకరణలో పారిశుధ్య ప్రమాణాలు పెంచాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజన్ను అనుసరించి నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఆదివారం యూసుఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో చెత్త సేకరణకు కేటాయించిన స్వచ్ఛ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారులపై డంపర్ బిన్లు లేకుండా చేసే ఉద్యమంలో భాగంగా ప్రతిఇంటి నుంచి చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరణను చేపట్టి స్వచ్ఛతలో యూసుఫ్గూడ సర్కిల్ను ఆదర్శంగా నిలపాలన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణను చేపట్టాలని కోరారు. ఇందుకు పారిశుధ్య సిబ్బందికి అవసరమైనన్ని స్వచ్ఛ ఆటోలను సమకూర్చుతామని వెల్లడించారు. ఇందులో తడి-పొడి చెత్తను వేరుగా సేకరించి ప్రాసెసింగ్కు, రీసైక్లింగ్కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య రావు, సీఎన్ రెడ్డి, ఏఎంఓహెచ్ బిందు భార్గవి, సూపర్వైజర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.