సూర్యాపేట, నమస్తే తెలంగాణ/సూర్యాపేట : 47వ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధూంధాంగా ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా 29 రాష్ర్టాల నుంచి వచ్చిన బాల, బాలికల జట్లు మొదట మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా గుస్సాడి డ్యాన్స్, కొమ్మకోయ, రాజన్న డప్పుల కళానృత్యాలు
నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక జాతీయ కబడ్డీ అసోసియేషన్ జెండాను, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ రాష్ట్ర జెండాను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. ఆ తర్వాత బి.మీడియా ఆధ్వర్యంలో చేపట్టిన లేజర్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. సుమారు గంటపాటు భారీ ఎత్తున పటాకులు కాల్చడంతో ఆకాశంలో కాంతులు వెదజల్లాయి. పోటీల ప్రారంభోత్సవానికి కొన్ని నిమిషాల ముందు గ్యాలరీ కూలి అపశ్రుతి చోటు చేసుకోగా క్షతగాత్రులను వెంటనే దవాఖానకు తరలించారు. ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో వెంటనే తేరుకొని ఆర్గనైజర్లు క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ సూర్యాపేట ఖ్యాతిని పెంచేందుకే మంత్రి జగదీశ్రెడ్డి తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ, ఎవరూ ఇలాంటి క్రీడలను నిర్వహించలేదని తెలిపారు.
కేవలం రాజధానుల్లోని ఇండోర్ స్టేడియాల్లో జరిగే కబడ్డీ పోటీలను సూర్యాపేట పట్టణం వరకు తీసుకొచ్చి ఔట్డోర్లో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్వహించడం సూర్యాపేటకే గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల అభివృద్ధి కోసం రూ. వంద కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఈ క్రీడలు సూర్యాపేటకు వచ్చాయన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఛైర్మన్ ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ భారీ ఎత్తున నిర్వహించే క్రీడల్లో చాలా సార్లు అపశ్రుతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయని, ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా గాయాలతో బయట పడడం అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమాల్లో జగదీశ్యాదవ్, మున్సిపల్ ఛైర్పర్సన్ పెరమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
హాజరైన ప్రముఖులు : జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి భారత దేశం తరపున కబడ్డీ ఆడిన మాజీ క్రీడాకారుడు పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత అజయ్ఠాకూర్, అర్జున్ అవార్డు గ్రహీతలు రాజారత్నం, మౌనికనాథ్, ఉన్నప్పగౌడ్లతో పాటు పలువురు హాజరయ్యారు.
తొలిరోజు పన్నెండు మ్యాచ్లు : ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన వెంటనే రాత్రి పది గంటలకు ఆరు కోర్టుల్లో తొలి విడుత 6 మ్యాచ్లు పూర్తి కాగా వెంటనే మరో ఆరు మ్యాచ్లు నిర్వహించారు. కాగా రెండో విడుత రాత్రి 11:30 గంటలకు ఆరు కోర్టుల్లో మ్యాచ్లు ప్రారంభమయ్యాయి.