హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు బోయిన్పల్లి పోలీసులకు లొంగిపోయారు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ భర్త భారవ్రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సోమవారం పోలీసు స్టేషన్కు వచ్చి సరెండర్ అయ్యారు. కిడ్నాప్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారు. జనవరి 5న బోయిన్పల్లికి చెందిన ప్రవీణ్రావుతోపాటు ఆయన సోదరులను కొందరి సాయంతో వీరు కిడ్నాప్ చేశారు.
ప్రవీణ్రావు సోదరుల అపహరణ కేసులో ఏ-1 గా అఖిలప్రియ, ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్రామ్ ఉన్నారు. ఈ కేసులో జనవరి 22న సికింద్రాబాద్ కోర్టు అఖిల ప్రియకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. భార్గవ్రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ముందస్తు బెయిల్కోసం ప్రయత్నించినా కోర్టు తిరస్కరించింది. హఫీజ్పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్ రావు సోదరులను వీరు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.