బాధితులకు న్యాయం చేయాలి
అధికారులకు మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశం
మంచిర్యాల అర్బన్, మార్చి 18 :జిల్లాలో పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని అధికారులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ నివారణపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో గురువారం నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, ఆర్డీవో శ్యామలాదేవితో కలిసి పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు కలెక్టరేట్ పరిధిలో 21 కేసులు, పోలీస్ శాఖ పరిధిలో 17 కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వీటిని సత్వరమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. త్వరగా నష్ట పరిహారం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ జిల్లా సభ్యులు లింగయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతిపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ప్రగతి పనులను గడువులోగా పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని అధికారులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి హెచ్చరించారు. కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్, టేకులపల్లి, గొల్లగట్టు గ్రామాల్లోని శ్మశాన వాటికలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను ఆమె గురువారం పరిశీలించారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఈ నెల 25వ తేదీలోగా పనులు చేయాలని ఆదేశించారు. వచ్చే హరితహారం నాటికి లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో శంకరమ్మ, ఎంపీవో సతీశ్రెడ్డి, కార్యదర్శులు ఉన్నారు.