న్యూఢిల్లీ: ఓ యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే.. ఆ యువతి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామని చెప్పింది. అతడు అలాగే అన్నాడు. బెయిల్ దొరికింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును 9 మంది మహిళా లాయర్లు సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. అత్యున్నత న్యాయస్థానం గురువారం దానిని కొట్టేసింది. మూస ధోరణులకు దారితీసే వ్యాఖ్యలు జడ్జీలు చేయకపోవడమే మంచిది అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో జడ్జీలు, లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనుసరించడానికి ఓ మాడ్యూల్ను రూపొందించాల్సిందిగా జ్యూడీషియల్ అకాడమీకి ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు తెలిపింది.
అసలేంటీ కేసు?
లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నవిక్రమ్ బాగ్రీ అనే వ్యక్తి గతేడాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది జులై 30న అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి కొన్ని షరతులు విధించింది. అందులో ఒకటి ఏంటంటే.. రక్షాబంధన్ రోజు ఆ బాధిత యువతి ఇంటికి వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకొని జీవితాంతం ఆమె రక్షణగా ఉంటానని హామీ ఇవ్వడం. అలా చెప్పి రూ.11 వేలు ఆమెకు ఇవ్వడంతోపాటు, ఆమె కొడుకుకు కొత్త బట్టలు, స్వీట్లు కోసం రూ.5 వేలు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ 9 మంది మహిళా లాయర్లు సుప్రీంకు వెళ్లారు.