ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఆదర్శవంతమైన పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బాలరాజు ప్రవేశపెట్టారు. కేసీఆర్ ముందుచూపు, దార్శనికతతో పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడిందని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలపై మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదలచేసిన తర్వాత ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మానేశాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తే.. శాశ్వతంగా ప్రధానిగా ఉండాలన్న నరేంద్రమోదీ కోరిక తప్పక నెరవేరుతుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఏ ప్రతిపాదన తీసుకొనివెళ్లినా .. కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని, నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించడంద్వారా రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదన్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని బాలరాజు స్పష్టంచేశారు.