హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీకి సంబంధం లేని అంశాలను సభలోకి తెచ్చి విలువైన సమయాన్ని వృథాచేస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం పరిధిలోని అంశాలపై చర్చకు అసెంబ్లీ వేదిక కాదని స్పష్టంచేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాల వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోవద్దని.. గతేడాది మాదిరిగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. అదేవిధంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై చర్చించాలని పట్టుబట్టారు. కేంద్రం సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బీజేపీయేతర రాష్ర్టాల శాసనసభలు వ్యవసాయచట్టాలను రద్దు కోరుతూ తీర్మానంచేయాలని డిమాండ్చేశారు. అప్పటికే విక్రమార్కకు ఇచ్చిన సమయం మించిపోవడంతో ప్రసంగాన్ని ముగించాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పదే పదే విజ్ఞప్తిచేసినా వినకుండా కొనసాగిస్తుండటంతో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలుగజేసుకొని.. సభకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించాలని విజ్ఞప్తిచేసినా భట్టి వినిపించుకోలేదు. మిగతా కాంగ్రెస్ సభ్యులు కూడా భట్టికి అండగా నిలిచి గందరగోళం సృష్టించడంతో ఆర్థికమంత్రి హరీశ్రావు జోక్యంచేసుకొని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై, విధానాలపై అసెంబ్లీలో చెప్పాల్సిన పనిలేదని, ఇది వేదిక కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం చేసిన చట్టాలు అసెంబ్లీ పరిధిలో లేవని పేర్కొన్నారు. ‘చట్టాలపై మనం చెప్పాల్సిన విషయాన్ని గతంలోనే సభ నుంచి చెప్పాం. బయట చెప్పాం. రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై చర్చ చేద్దాం. అంతేకాని సభా సమయాన్ని వృథా చేయకూడదు’ అని పేర్కొన్నారు. ఒకానొక దశలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వటం లేదని, తాము సభలోకి రాకూడదా? అని ఆరోపించడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సభలో చాలా విషయాలు చర్చకు రావాలి. సభా సంప్రదాయాలను కాపాడుకోవాలి. కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఈ సమయంలో ప్రజలకు ఏం కావాలి? ఏం చేద్దాం అనే విషయాలపై సమగ్రమైన చర్చచేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన వేదికమీద సమయాన్ని వృథా చేయకూడదని సూచిస్తుంటే మేం సభకు రావాద్దా? అని మాట్లాడటం ఏమిటి? సభకు రావద్దని ఎవరన్నారు? మిమ్మల్ని రావద్దని మేము ఎందుకు అంటాం. ప్లాట్ఫాం స్పీచ్లాగా మాట్లాడొద్దు? పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని వ్యవహరించాలి. సభా సమయాన్ని వృథా చేయటం ఏం పద్ధతి?’ అని కేసీఆర్ మందలించారు.