ఇది మంటల కాలం. మండుతున్న ఎండలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు చురుక్కుమంటున్నాయి. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఆదాయాలు పడిపోయిన జనానికి అధిక ధరలు పెనుభారంగా మారాయి. నూనెల ధరలు 40నుంచి 60శాతం పెరిగాయి. చింతపండు రూ. 200లకు చేరుకున్నది. ఇక పప్పుదినుసులు సరేసరి. సామాన్యుడికి ‘ఏది కొనేటట్లులేదు-ఏమి తినేటట్లు లేదు’. హైదరాబాద్నగరంలో ఓ రిటైల్ వ్యాపారి సగటున రోజుకు రూ.60వేల నుంచి రూ.80వేల విలువగల సరుకులు అమ్మేచోట, ఇప్పుడు యాభై వేలకు పడిపోయిందంటే ఆహారవినియోగం ఏ స్థాయిలో తగ్గిపోయిందో ఊహించవచ్చు.
కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ధరల పెరుగుదలకు కారణమనే ఆరోపణ ఉన్నది. 2017 జూన్ నుంచి కేంద్రం ‘దినసరి ధరల యంత్రాంగం’ (డైలీ ప్రైస్ మెకానిజం)తో ఇంధన ధరలను లింక్ చేసింది. దాంతో రోజువారీగా యాభై పైసల చొప్పున పెట్రో ధరలు పెరుగుతున్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 106.72 డాలర్లు. నేడది 65డాలర్లకు పడిపోయింది. అయినా పెట్రోల్ రేటు 42శాతం, డీజిల్ రేటు 26శాతం పెంచారు. పెట్రో ధరలు పెరగటానికి చమురు రంగాన్ని ఆదాయవనరుగా చూడటమే కారణం. పెట్రోలు ధరలో 67శాతం, డీజిల్ ధరలో 61శాతం పన్నులే ఉంటున్నాయి. పన్నులు లేకుంటే ముప్పై రూపాయలకే లీటర్ పెట్రోలు ఇవ్వవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. వంటగ్యాస్ ధర 2014లో రూ.414 ఉంటే ఇప్పుడది రూ. 851కి చేరుకున్నది. నిత్యావసరంగా మారిన గ్యాస్, పెట్రో ధరలు పెరిగిపోవటంతో జనజీవనం అతలాకుతలం అవుతున్నది. అత్యవసరాలైన వాటిని సబ్సిడీద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది.
మన దేశ సముద్ర తీర ప్రాంతంలో విస్తారమైన చమురు, సహజవాయు నిక్షేపాలున్నాయి. వాటిని బయటకు తీసి శుద్ధి చేసి ప్రజలకు అందించవచ్చు. రవాణా, రిటైల్ వ్యయం పోను నలభై రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వొచ్చు. గ్యాస్ను ఉచితంగానే పంపిణీ చేయవచ్చనే అభిప్రాయం ఉందంటే, ఎంత చౌకగా అందించవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఆత్మనిర్భర్ గురించి గొప్పగా చెప్పే కేంద్ర ప్రభుత్వం చమురు రంగంలో స్వావలంబనను పట్టించుకోవటం లేదు. వాటిని ప్రైవేటు కంపెనీలకే కట్టబెట్టింది. మన ఇంధన అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడేట్లు చేస్తున్నది. దేశీయ సహజ వనరులను ప్రజావసరాలకు సద్వినియోగం చేయటంపైనే ప్రజాసంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఇతరకారణాలతో వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ధరల పెరుగుదలను అరికట్టాలి.