అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల్లో అంతర్గత ప్రజాస్వాయ్యం ఎక్కువైందని, పరిస్థితిని చూస్తూ ఊరుకోబోనని త్వరలో అందరినీ నియంత్రిస్తానని అన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేతను టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల మధ్య వర్గాపోరు నేపథ్యంలో పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అమరావతిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు. అభివృద్ధితో సంపద సృష్టించి సంక్షేమం చేద్దామనుకుంటే, జగన్ ముద్దులు కురిపిస్తే ఓట్లేశారని ఓటర్లనుద్దేశించి అన్నారు.
అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని.. అవసరం తీరాక రాజధాని మార్చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలీసులు చక్కగా పనిచేశారని వారికి ఇప్పుడేమైందో అర్థం కావడం లేదని అన్నారు. ‘డీజీపీకి నెత్తిమీద టోపీ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు. జగన్కు ఏడాదికి రూ. 5 వేల కోట్లు కావాలి. మద్యం సొమ్ము అడ్డుపెట్టుకొని అప్పులు చేస్తున్నారు. రూ. 50 వేల కోట్ల అప్పు తెస్తే మద్యపాన నిషేధం ఎలా అమలవుతుంది’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్కు ధైర్యం ఉంటే బయటకు వచ్చి తన మాటలకు కౌంటర్ ఇవ్వాలని సవాల్ చేశారు.