అంబర్పేట, మార్చి 5: నల్లకుంట ఫీవర్ దవాఖానలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రంలోని వసతులపై హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. టీకా కోసం వచ్చిన వృద్ధులను గంటల తరబడి కూర్చోబెట్టడంతో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. శుక్రవారం ఫీవర్ ఆస్పత్రిలోని టీకా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులకు టీకా ఇచ్చే తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కనీస సౌకర్యాలు లేని మొదటి అంతస్తులో వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే దీన్ని గ్రౌండ్ ఫ్లోర్కు మార్చాలని, కుర్చీలు లేకపోతే బెడ్లపైన ఇద్దరి చొప్పున కూర్చోబెట్టాలని, బయట టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిగ్నల్ సరిగా లేని చోట కంప్యూటర్ ఎందుకు పెట్టారని.. పేర్లు నమోదు చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. వృద్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇందుకోసం రూ. 50 వేల నిధులు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. దవాఖానలోని సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ కలెక్టర్కు వివరించారు. అయితే అన్ని సక్రమంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, తిరిగి రెండు రోజుల్లో ఇక్కడకు వస్తానని తెలిపారు.
నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో కొవాగ్జిన్ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని.. ప్రజలు నిర్భయంగా వచ్చి టీకాలు వేసుకోవాలని కలెక్టర్ శ్వేతా మహంతి కోరారు. వ్యాక్సిన్పై అపోహలు తొలగించేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డా.వెంకటి, ఫీవర్ దవాఖాన సూపరింటెండెంట్ డా.కె.శంకర్, ఆర్ఎంవో డా.చంద్రశేఖర్, హిమాయత్నగర్ తహసీల్దార్ లలిత, తిలక్నగర్ మెడికల్ ఆఫీసర్ డా.దీప్తి పాల్గొన్నారు.
సిటీబ్యూరో, మార్చి5 (నమస్తే తెలంగాణ):జిల్లాలోని 283 అంగన్వాడీ కేంద్రాలను వెంటనే విశాలమైన గదుల్లోకి మార్చాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. 0-5 ఏండ్ల పిల్లల గ్రోత్ మానిటరింగ్పై చేపట్టిన స్పెషల్ డ్రైవ్ను కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్రావు నుంచి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ గ్రోత్ మానిటరింగ్లో హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలో 97శాతంతో ప్రథమస్థానంలో ఉందని, దీన్ని 100% సాధించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో సంక్షేమాశాఖ అధికారులు పాల్గొన్నారు.