జియోబుక్ ఫీచర్లపై అంచనాలు
11 నానో మీటర్ టెక్నాలజీతో పనిచేసే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్.
ఇన్బిల్ట్ 4జీ ఎల్టీఈ మోడెమ్.
5 గిగాహెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలరో మీటర్ క్వాల్కమ్ ఆడియో చిప్, మినీ హెచ్డీఎంఐ పోర్ట్.
ప్రీ లోడెడ్ జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్, జియో యాడ్ సర్వీసెస్.
న్యూఢిల్లీ, మార్చి 5: దేశీయ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపేందుకు సిద్ధమవుతున్నది. సొంత ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో ‘జియోబుక్’ ల్యాప్టాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. 4జీ సెల్యులార్ కనెక్టివిటీని కలిగి ఉండే ఈ ల్యాపీని రెండు నెలల్లో మార్కెట్లోకి తీసుకురావాలని జియో భావిస్తున్నట్లు సమాచారం. జియోబుక్ ఫీచర్లు, ఇతర వివరాలపై టెక్ వర్గాల్లో ఇప్పటికే పలు అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి. మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర బ్రాండ్ల ల్యాప్టాప్లతో పోలిస్తే చాలా తక్కువ ధరకే రిలయన్స్ జియోబుక్ను తీసుకొచ్చే అవకాశం ఉన్నదని కొన్ని నెలల క్రితమే వార్తలు వచ్చాయి. ఈ ల్యాపీల తయారీ కోసం చైనాకు చెందిన బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థతో జియో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ పనులు కీలక దశకు చేరుకున్నాయని, జియోబుక్ ల్యాప్టాప్ల తయారీ ప్రారంభమైందని సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నెలాఖరులోగా జియోబుక్ ల్యాపీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. వాస్తవానికి సెల్యులార్ కనెక్షన్తో పనిచేసే ల్యాప్టాప్ల తయారీపై రిలయన్స్ జియో ఆసక్తితో ఉన్నట్లు అమెరికాకు చెందిన క్వాల్కమ్ టెక్నాలజీస్ సంస్థ సీనియర్ ప్రొడక్ట్ డైరెక్టర్ మిగ్యుల్ నూన్స్ 2018లోనే వెల్లడించారు. మూడేండ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. సాధారణ ల్యాపీల్లా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో కాకుండా ఆండ్రాయిడ్ ఓఎస్తో జియోబుక్ పనిచేయనుండటం ఆసక్తికర విషయం. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి జియోబుక్లో వినియోగించనున్నారు. దీన్ని జియో ఓఎస్ అని పిలువనున్నట్లు తెలుస్తున్నది. జియోబుక్ ల్యాపీ ధరపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మొబైల్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్న జియో.. ఈ ల్యాప్టాప్లను కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.